● శ్వేతార్క వినాయకుడిగా అలంకరణ
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం మూల మహా గణపతిని శ్రీశ్వేతార్క గణపతిగా అలంకరించారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, ఉత్సవ విగ్రహానికి గణపతి సూక్త మంత్ర పఠనంతో షోడశోపచారపూజలు, మహా హారతి జరిగాయి. పంచలోహ గణపతి ఉత్సవమూర్తిని హంసవాహనంపై ప్రతిష్ఠించి పురవీధుల గుండా ఊరేగించి పల్లకీసేవ నిర్వహించారు. డాక్టర్ పరిమండ్ల పద్మావతి సౌజన్యంతో గణపతి నవగ్ర హ రుద్రహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈఓ వెంకటయ్య భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.