ఎన్నికలకు సర్వసన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సర్వసన్నద్ధం

Sep 25 2023 1:20 AM | Updated on Sep 25 2023 1:20 AM

బీఎల్‌ఓలు, అధికారులతో కలెక్టర్‌ సమీక్ష(ఫైల్‌) - Sakshi

బీఎల్‌ఓలు, అధికారులతో కలెక్టర్‌ సమీక్ష(ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: సార్వత్రిక ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి వరంగల్‌ అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. సుమారు 27.89 లక్షల పైచిలు కు ఓటర్ల కోసం 3,252 పోలింగ్‌ కేంద్రాలు, 5,890 వరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) సిద్ధం చేశారు. మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేసిన అన్నిస్థాయిల అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. అక్టోబర్‌ ఒకటో తేదీ తర్వాత బదిలీలు, పోస్టింగ్‌లపై ఎన్నిక ల సంఘం నిషేధం విధించిన నేపథ్యంలో అరకొరగా మిగిలిన బదిలీలు, పోస్టింగ్‌లు ఈ నెలాఖరు వరకు పూర్తి కానున్నాయి. ఓటర్ల నమోదు, ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ వారంలో రెండు పర్యాయాలు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంతకుముందు ఆగస్టు 30న హైదరాబాద్‌లో కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ కలెక్టర్లు, సీపీ/ఎస్పీలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్‌ కార్యాలయాల్లో ఎన్నికల సెల్‌లు ఏర్పాటు చేసి ఓటరు నమోదు, ఓటుహక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు..

ఉమ్మడి జిల్లా పరిధి 12 నియోజకవర్గాల్లో 27,89,336 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 13,85,231 పురుషులు, 14,03,860 సీ్త్రలు, 245 ఇతరుల ఉన్నట్లు గతంలో అధికారులు ప్రకటించారు. 3,252 పోలింగ్‌ కేంద్రాలు, 5,890 వరకు ఈవీఎంలను సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే సున్నిత, అతి సున్నిత గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాలను గుర్తించిన అధికారులు వివరాలను గోప్యంగా ఉంచారు. వీడియో రికార్డింగ్‌, వెబ్‌కాస్టింగ్‌, లైవ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు ఎన్‌ఐటీ, ఇతర యూనివర్సిటీ విద్యార్థులను వినియోగించుకునే అవకాశాలపైనా సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అక్రమ మద్యం, డబ్బు రావడానికి వీలు లేకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు పాయింట్లను గుర్తించారు. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గానికి రిటర్నింగ్‌ అధికారితో పాటు ఏఆర్‌ఓల నియామకం జరిగింది. ఇతర ఎన్నికల సిబ్బందిని సైతం ఎంపిక చేసి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గత ఎన్నికల నివేదికల పరిశీలన..

సాధారణంగా ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండగా.. 2018 సార్వత్రిక ఎన్నికల పరిణామాలపైనా కలెక్టర్‌, ఎస్పీలు పరిశీలించినట్లు తెలిసింది. ఘర్షణలు, నమోదైన కేసులపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలు రానుండగా.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో మోహరించే విషయమై కసరత్తు చేసి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మకంగా మారిన గ్రామాలపై సమీక్ష నిర్వహించి వచ్చే ఎన్నికల పోలింగ్‌ కోసం నిఘా పెంచే ప్రయత్నంలో ఉన్నారు. 2018 ఎన్నికల సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద 57కు పైగా కేసులు నమోదు కాగా.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. వివిధ కారణాలతో ఆయుధ లైసెన్స్‌లు పొందిన పలువురి జాబితాను తయారు చేసిన అధికారులు.. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే వారి ఆయుధాలు స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు సిద్ధం చేశారు. ఇప్పటికే రౌడీషీటర్ల జాబితాను రెడీ చేసిన పోలీసులు ఠాణాల వారీగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన వెంటనే నోటిఫికేషన్‌ వెలువడవచ్చన్న సమాచారం మేరకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది.

ఉమ్మడి జిల్లాలో ఓటర్లు : 27,89,336

పురుషులు : 13,85,231

సీ్త్రలు : 14,03,860

ఇతరులు : 245

పోలింగ్‌ కేంద్రాలు : 3,252

షెడ్యూల్‌ ప్రకారమేనన్న ప్రచారం..

ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

వీడియో కాన్ఫరెన్స్‌ల్లో

సీఈఓ వికాస్‌రాజ్‌ సమీక్ష

ఓటర్ల నమోదు, ప్రక్రియపై ఆరా..

ఇప్పటికే కలెక్టరేట్లలో

‘ఎలక్షన్‌ సెల్‌’ల ఏర్పాటు

సమస్యాత్మక పోలింగ్‌

కేంద్రాల గుర్తింపు..

శాంతిభద్రతల చర్యల్లో

పోలీసుల నిమగ్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement