సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ

Sep 23 2023 1:22 AM | Updated on Sep 23 2023 1:22 AM

మంగపేట: మంగపేట మండలం షెడ్యూల్‌, నాన్‌షెడ్యూల్‌ కేసు వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. 1973 నుంచి నలుగుతున్న వివాదం రెండోసారి 2006లో పురుడు పోసుకుంది. దీంతో 2001 నుంచి మండలంలో ఎన్నికలు నిలిచిన విషయం తెలిసిందే. సమస్యకు ముగింపు పలుకుతూ.. మండల పరిధి 23 రెవెన్యూ గ్రామాలు ఐదో షెడ్యూల్‌ ఏరియా పరిధిలోకి వస్తాయని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 2023 జూలై 5న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. గిరిజనేతరులు స్టే ఇవ్వాలని కోరుతూ.. ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించి అప్పీలు దాఖలు చేశారు. అప్పీల్‌ నంబర్‌ 20490 ఆఫ్‌ 2023పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుద్‌ బోస్‌, గౌరవ న్యాయమూర్తి బేల త్రివేది ఎదుట శుక్రవారం వాదనలు జరిగాయి. ఆదివాసీ గిరిజనుల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌, మృగాంక్‌ ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో షెడ్యూల్‌(ఏజెన్సీ) పరిధిలోకే వస్తాయని అనేకమార్లు జరిగిన విచారణ తర్వాత వెలువడిన తీర్పులు కూడా దీన్నే ధ్రువీకరించాయని గుర్తు చేశారు. స్టే ఇవ్వాలని గిరిజనేతరుల న్యాయవాది కోరగా.. స్టే ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇప్పటికే హైకోర్టులో గిరిజనులకు అనుకూలంగా స్టే ఇచ్చినందున ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇవ్వకూడదని గిరిజనుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పిటిషనర్‌ తరఫు వాదనలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం తగిన వివరాలను కౌంటరు అఫిడవిట్‌లో పొందుపర్చాలని గిరిజనుల తరఫు న్యాయవాది ప్రభాకర్‌కు సూచిస్తూ కేసు విచారణను అక్టోబర్‌ 10 వరకు కోర్టు వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు మళ్లీ మంగపేట మండల గిరిజన, గిరిజనేతరుల మధ్య నెలకొన్న ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా గిరిజన, గిరినేతర ప్రజలు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement