
సావనీర్ను విడుదల చేస్తున్న నిట్ డైరెక్టర్
● నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
కాజీపేట అర్బన్: సమాజంలోని సమస్యలను పరిష్కరించి, మెరుగైన సమాజ నిర్మాణానికి పరిశోధనలు తోడ్పడాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్లోని సెమినార్ హాల్ కాంప్లెక్స్లోని రామన్హాల్లో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘రీసెర్చ్ మెథడాలజీ కోర్స్ ఇన్ సోషల్ సైన్సెస్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన పదిరోజుల వర్క్షాప్ను శుక్రవారం బిద్యాధర్ సుబుదీ ప్రారంభించారు. ముందుగా సావనీర్ను విడుదల చేసి మాట్లాడారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పదిరోజుల వర్క్షాప్ను సమాజంలోని సమస్యల పరిష్కారానికి రీసెర్చ్లు చేసే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ బి.రాజశేఖర్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హెడ్ రమాదేవి, రామ్లాల్, సునీత, తదితరులు పాల్గొన్నారు.
మెటలర్జీ విభాగంలో అంతర్జాతీయ సదస్సు
నిట్లోని మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ హైదరాబాద్ సౌజన్యంతో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. మిశ్రా దాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్, డైరెక్టర్ సంజయ్కుమార్, ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
● రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ : రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యవసాయ అధికారులు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ డీలర్లు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, ఆదర్శ రైతులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వివిధ కంపెనీల ఎరువుల సరఫరా, ఎఫ్ఓఎల్పై అందిస్తున్న ఎరువులు, ఎరువుల లభ్యత గురించి చర్చించారు. ఈ సందర్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలుగకుండా అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారులు, డీలర్లు రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని సూచించారు. డీలర్లు ఎఫ్ఓఎల్పై మాత్రమే ఎమ్మార్పీకి మించకుండా ఎరువులు విక్రయించాలని పేర్కొన్నారు. పురుగు మందుల పేరుతో బయో మందులను అమ్ముతున్న డీలర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్య అతిథి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే రైతు బంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తోందని వివరించారు. రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. డీలర్లు, తయారీదారులు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు రైతులకు అందించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈపాస్ మిషన్ల ద్వారానే డీలర్లు ఎరువులను అమ్మాలని, ఎప్పటికప్పుడు ఎరువుల నిల్వలు క్లియర్ చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ కార్యదర్శి శారదాదేవి, వ్యవసాయ అధికారులు ఉషాదయాళ్, రవీందర్సింగ్, వ్యవసాయ శాఖ సంచాలకులు దామోదర్రెడ్డి, సురేష్కుమార్, శ్రీనివాస్, ఏఓ విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నాగుర్ల వెంకటేశ్వర్లు