ఉద్యాన కళాశాలలో సీట్ల భర్తీకి చర్యలు● | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన కళాశాలలో సీట్ల భర్తీకి చర్యలు●

Sep 23 2023 1:22 AM | Updated on Sep 23 2023 1:22 AM

రెండో కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల కేటాయింపు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలం మల్యాలలోని ఉద్యాన పరిశోధన స్థానానికి అనుబంధంగా ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఉద్యాన కళాశాలలో ప్రవేశానికి రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కళాశాల మంజూరు జీఓ విడుదలైనప్పటికీ పూర్తిస్థాయిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చడంలో జాప్యం జరిగింది. ఈకారణంగా మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు భర్తీ చేయలేదు. దీంతో ఉద్యాన కళాశాలలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ ఏడాది మల్యాలలో సీట్లు భర్తీ కావేమోనని ఆందోళనకు గురయ్యారు. స్పందించిన మంత్రి సత్యవతిరాథోడ్‌ సంబంధిత అధికారులు, కలెక్టర్‌ శశాంక, డీహెచ్‌ఎస్‌ఓ సూర్యనారాయణ తదితరులతో సమీక్షించినట్లు తెలిసింది. సీట్ల భర్తీ అనంతరం మౌలిక సదుపాయాలు, భవనం, అధ్యాపకుల నియామకం అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ భవన సమీపంలో ఉన్న జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, ఇతర శాఖలు కొనసాగిన భవన సముదాయంలో మల్యాల ఉద్యాన కళాశాల తరగతులు కొనసాగించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌

అడ్మిషన్ల గడువు పెంపు

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు గడువు పొడిగించినట్లు హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ మురాల శంకర్‌రావు శుక్రవారం తెలిపారు. దూరవిద్యా విధానంలో టెన్త్‌, ఇంటర్‌ చదవాలన్న ఆసక్తిగల అభ్యర్థులు సమీపంలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాలైన ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో సంప్రదించాలన్నారు. దళారులను నమ్మొద్దని, ఫీజులు మీసేవ, టీఎస్‌ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో చెల్లించాలని సూచించారు. వివరాలకు www.telanganaopenschool. org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

గంజాయి పట్టివేత

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం పోలీసులు సుమారు 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో తరలించేందుకు గంజాయి సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈవిషయమై ఎస్‌ఐని వివరణ కోరగా.. గంజాయి పట్టుకున్నది వాస్తవమేనని, ఎంత పట్టుకున్నది, నిందితుల వివరాలు ఉన్నతాధికారుల విచారణ అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement