
హన్మకొండ: హనుమకొండ పెద్దమ్మగడ్డ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్కు ఆనుకుని ఉన్న మత్స్య సహకార సంఘం స్థలాన్ని శుక్రవారం ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఈ స్థలం తమకు కేటాయించాలని పెద్దమ్మగడ్డ వాసులు కోరుతుండడంతో వారు ఈ స్థలాన్ని సందర్శించారు. స్థానికుల అభిప్రాయాన్ని తీసుకున్న వినయ్భాస్కర్, అనంతరం ములుగురోడ్ సమీపంలోని మత్స్యశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వెనుకాల గల శాఖ స్థల మ్యాప్ను పరిశీలించారు. సహకార సంఘానికి శాఖ ఆవరణలోని స్థలం కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వినయ్భాస్కర్ అన్నారు. కాగా కెనాల్ పక్కనే 2013లో 17గుంటల స్థలాన్ని రూ.4.25లక్షలతో ప్రభుత్వంనుంచి కొనుగోలు చేశామని, ఆ స్థలాన్ని తమకు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీఓ నెంబర్ 527 సైతం విడుదల చేసిందని మత్స్య సహకారం సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్సా మల్లేశం.. చీఫ్విప్ వినయ్భాస్కర్, బండా ప్రకాశ్కు తెలిపారు. ఈ మేరకు ఇరువర్గాలకు న్యాయం జరిగేలా చొరవ చూపుతామని సూచించారు. వారి వెంట హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ విజయభారతి, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ట్రాఫిక్ నియమాలు పాటించండి
వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్తో కలిసి శుక్రవారం సాయంత్రం హనుమకొండ చౌరస్తాలోని పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్లతో మాట్లాడారు. పార్కింగ్ స్థలాలను గుర్తించి ట్రాఫిక్లో రెగ్యులరైజ్ చేసినట్లయితే చిరువ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. వినాయక నిమజ్జనం తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.