
రూటు మారింది.. లేటు పెరిగింది
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించడంతో ప్రయాణికులు శుక్రవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడో రైల్వే లైన్ నిర్మాణం కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే సికింద్రాబాద్–దానాపూర్–సికింద్రాబాద్ వెళ్లే రైళ్ల అప్ అండ్ డౌన్ సర్వీస్లను ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వయా నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. దీంతో కాజీపేట నుంచి కాశీకి వెళ్లే ప్రయాణికులు, యాత్రికులు, అదేవిధంగా ఈ రైళ్ల సర్వీస్లలో కాజీపేట నుంచి బెల్లంపల్లి, బల్లార్షా మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు వేరే రైలు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించారు. చివరికి యశ్వంత్పూర్–గోరఖ్పూర్ రైలులో వెళ్లారు.
ఇన్నాళ్లు నక్కి.. ఇప్పుడు చిక్కి
కాజీపేట అర్బన్: నగరంలోని 31వ డివిజన్ పరిధి న్యూశాయంపేట జంక్షన్ నుంచి పద్మాక్షి రోడ్డుకు వెళ్లే మార్గంలో జూ పార్క్కు ఆనుకుని ఉన్న మారుతినగర్ నాలాలో రెండేళ్లుగా వర్షం వస్తే చాలు మొసళ్లు వస్తున్నాయి. ఇదే తరహాలో గురువారం కురిసిన వర్షానికి శుక్రవారం ఉదయం మొసలి స్థానికులకు తారసపడింది. వారు జూపార్క్, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వైటర్నరీ డాక్టర్ ప్రవీణ్కుమార్, జూపార్క్ రేంజ్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో జూపార్క్, ఫారెస్ట్ టీం చాక చక్యంగా జేసీబీ సాయంతో మొసలిని పట్టుకున్నారు. దీంతో వారికి న్యూశాయంపేటవాసులు కృతజ్ఞతలు తెలిపారు. మొసలిని జూపార్క్లో ఉంచనున్నట్లు తెలిసింది.
న్యూస్రీల్
