హన్మకొండ :.....

హనుమకొండ ఆర్టీసీ కాలనీలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌ భవనం  - Sakshi

హన్మకొండ : ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో అధిక ఫీజులు చెల్లించి శిక్షణ పొందే ఆర్థిక స్థోమత లేని పేదలకు ఎస్సీ స్టడీ సర్కిల్‌ అండగా నిలుస్తోంది. పేదలకు ఉద్యోగాలు అందించే విద్యాలయంగా వెలుగొందుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు నిపుణులైన అధ్యాపకులతో అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ఉద్యోగం సాధించేలా నిరుద్యోగులను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే అనేక మందిని ఉద్యోగులుగా తయారు చేసింది. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆర్టీసీ కాలనీలో ఏర్పాటైన ఎస్సీ స్టడీ సర్కిల్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా నిలిచింది.

షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ పేద నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ, భోజన వసతి కల్పిస్తూ వరంగల్‌ ఉమ్మడి జిల్లా స్థాయిలో 2015–16లో ఎస్సీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించింది. 2016 నుంచి ఏటా రెండు కోచింగ్‌ ప్రోగ్రాం (5 నెలల కాలంతో)నిర్వహిస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు 5 నెలల కోచింగ్‌ ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ ఉద్యోగాలకు, గ్రూప్‌–1, 2, 3, 4, బ్యాంకింగ్‌, పోలీస్‌, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నారు.

కోచింగ్‌కు అర్హత

కోచింగ్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులు. ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్‌ ఆధారంగా 75 ఎస్సీ, 15 బీసీ, 10 ఎస్టీలకు చెందిన వారిని ఎంపిక చేసి ఉచిత భోజన, వసతి కల్పిస్తూ పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. వివిధ సబ్జెక్టుల్లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన మోడల్‌లో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన, విషయ పరిజ్ఞానం కలిగిన ఫ్యాకల్టీ ద్వారా రోజు వారీగా తరగతులు నిర్వహించడంతోపాటు కార్పొరేట్‌, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు దీటుగా శిక్షణ ఇస్తున్నారు. పోటీ పరీక్షలకు నమూనా పరీక్షలు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. ఈ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఇప్పటివరకు 134 ఉద్యోగాలు సాధించారు. వీరిలో 7గురు ఎస్సై, 41 మంది కానిస్టేబుల్‌, 9 మంది ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఇద్దరు వీఆర్‌ఓలు, 48 మంది జూనియర్‌ పంచాయతీ ఆఫీసర్లు, ఇద్దరు టీజీటీ ప్రిన్సిపాళ్లు, ఇద్దరు హెచ్‌డబ్ల్యూఓలు, ఆరుగురు గ్రూప్‌–4, 9 మంది ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలు పొందారు. అలాగే ఈ అధ్యయన కేంద్రం ద్వారా 2021 నుంచి 2023 వరకు శిక్షణ పొందిన అభ్యర్థుల్లో 152 మంది ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌, శారీరక ధారుడ్య, మెయిన్‌ పరీక్షలు రాశారు. గతంలో నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో 32 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

మహిళలకు,

పురుషులకు వేర్వేరుగా వసతి

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top