చేబ్రోలు: విద్యార్థులు సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని హైదరాబాద్లోని టీసీఎస్– ఇండస్ట్రీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్ ఆత్మకూరు సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు శుక్రవారం సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెల ప్రచురించబోయే రీసెర్చ్ నెక్సస్ జర్నల్ను ఆవిష్కరించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1100 మందికి పైగా విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ద్వారా 100కు పైగా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 80 శాతం మంది విద్యార్థులు ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఉద్యోగాలు సాధించిన తల్లిదండ్రులను సన్మానించారు. టీసీఎస్– ఇండస్ట్రీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను సత్కరించడం వెనుక ఉన్న భావం ఎంతో లోతైనదని, వారి త్యాగాన్ని గుర్తించే ప్రయత్నమని కొనియాడారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుందని, శ్రీరాముడు తన జీవితంలో ఎదురైన ప్రతి సవాలును అవకాశంగా మార్చుకుని విజయం సాధించినట్లే, విద్యార్థుల విజయాలు సాధించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ‘కోడ్ విటా’ పోటీలో విజ్ఞాన విద్యార్థి విజయం సాధించడం విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను పెంచిందన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన 1100 మంది పిల్లలు ఇంత క్లిష్ట సమయంలో కూడా చాలా పెద్ద సంఖ్యలో మంచి ఉద్యోగాలు సాధించగలిగారని ఆనందం వ్యక్తం చేశారు. వీరు ఉద్యోగాలు సాధించడం వలన వాళ్ల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. విజ్ఞాన్లో చేరే పిల్లల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారనే ఉద్దేశంతో కేంబ్రిడ్జి యూనివర్సిటీ సహకారంతో ఆంగ్ల భాష నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం, నాయకత్వ స్ఫూర్తి, సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించడం కోసం ప్రత్యేక శిక్షణలు కొనసాగించడం, విద్యార్థులతో అధ్యాపక బృందం నిరంతరం మద్దతుగా నిలబడటం లాంటి అంశాల వల్ల విద్యార్థులు విజయం సాధించగలిగారని వివరించారు. వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఏఐ రాకతో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం ఎంతో కష్టంగా ఉందని, కాబట్టి విద్యార్థులు ఎప్పటికప్పుడు స్కిల్స్ను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు పాల్గొన్నారు.
టీసీఎస్– ఇండస్ట్రీ సొల్యూషన్ యూనిట్ హెడ్ భీమశేఖర్
ఘనంగా రీసెర్చ్ నెక్సస్ జర్నల్ ఆవిష్కరణ


