లేబర్ కోడ్లు రద్దు చేయకుంటే తీవ్ర ఉద్యమం
లక్ష్మీపురం: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు నష్టదాయకమైనవని, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వివిధ కార్మిక, ఉద్యోగ, రైతుసంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం గుంటూరు నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నగర కన్వీనర్ బి.ముత్యాలరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్కుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నరసింహారావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకష్ణమూర్తి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.కృష్ణ, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, వైఎస్సార్ టీయూ నగర అధ్యక్షులు మురళి, రైతు కూలీ సంఘం నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కిషోర్, లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, రైతుసంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్కుమార్, ఏఐకెయంయస్ రాష్ట్ర కార్యదర్శి ఘనిరాజులు మాట్లాడారు. కనీసం వేతనం రోజుకు రూ.168 ఉంటే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కనీస వేతనం రూ.800లుగా నిర్ణయించి అమలు చేస్తుందని గు ర్తు చేశారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయటం నేరమని, ఆందోళనలు చేస్తే జైళ్లకు పంపేందుకు అనుకూలంగా కార్మిక కోడ్లు రూపొందించారని విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారి గొంతు నులమటమేనని అన్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం మన దేశ రైతాంగానికి తీవ్రమైన సష్టం చేస్తుందని పేర్కొన్నారు. నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలని కార్మిక, రైతు సంఘాలు ఏకకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ, మున్సిపల్, టింబర్ ముఠా, ఆటో, అగ్రికల్చర్ యూనివర్సిటీ, రిటైర్డ్ పెన్షనర్స్, కోల్డ్స్టోరేజి ముఠా, అల్యూమినియం వర్కర్స్, సివిల్ సప్లయీస్ ముఠా, 104, 108, విద్యుత్ కాంట్రాక్టు, మెడికల్ రంగాల ఉద్యోగులు పాల్గొన్నారు.


