జనమే..అభిమానమై
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు పోటెత్తిన జనసందోహం ఆద్యంతం... అడుగడుగునా జననేతకు జన నీరాజనం రహదారుల వెంట బారులు తీరి ఘన స్వాగతం పలికిన మహిళా‘మణులు’ మేడలు, మిద్దెలు ఎక్కి పూలవర్షం కురిపించిన యువ ‘తరంగం’ కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపిన విద్యార్థి ‘లోకం’ ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడిన జగనన్న.. సంబరపడిన తల్లి బాణసంచా కాల్చుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచిన రాజధాని జనం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
తాడేపల్లి రూరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పర్యటనను ముందుగా కనకదుర్గ వారధి నుంచి బస్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్, భవానీపురం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి ఉంది. పోలీసులు, ప్రభుత్వం రాత్రికి రాత్రి రూటు మార్చి వెస్ట్ బైపాస్లో వెళ్లాలని సూచించారు.శుక్రవారం ఉదయం 11.35 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటకు రాగా అప్పటికే ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఆయన కాన్వాయ్ను అనుసరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్కి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. 11.35 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రాతూరు అండర్పాస్కు వచ్చేటప్పటికి 12.06 గంటలు అయ్యింది. అక్కడి నుంచి జాతీయ రహదారిపై అభిమానుల మధ్య వైఎస్ జగన్ కాన్వాయ్ మంగళగిరి, తెనాలి ఫ్లై ఓవర్కు 12.15గంటలకు చేరుకుంది. కాజా టోల్గేటు 12.25కి, మంగళగిరి వెస్ట్ బైపాస్కు 12.40, వెంకటపాలెం టోల్గేటుకు 1.30 గంటలకు చేరింది.
మహిళలతో కరచాలనం
వైఎస్ జగన్మోహన్రెడ్డి వెస్ట్ బైపాస్లో కృష్ణానది బ్రిడ్జిని 2.05 గంటలకు దాటి గొల్లపూడి గ్రామ శివారుకు చేరుకున్నారు. ఈ మధ్యలో తాడేపల్లి ఓల్డ్ టోల్గేట్ అండర్ పాస్ వద్ద పాతూరు, తాడేపల్లి సర్వీస్ రోడ్లో ఒక చోట, పాతూరు క్రాస్రోడ్లో తన వాహనం నుంచి బయటకు వచ్చి నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. కాజా వద్దకు భారీగా మహిళలు తరలిరాగా వారితో కరచాలనం చేశారు. కాజా టోల్గేటు వద్ద గుంటూరు నుంచి విజయవాడ వచ్చే రూట్లో మూడు నిమిషాలు ఆగి రోడ్డు వెంబడి ఉన్న కార్మికులకు, అభిమానులకు అభివాదం చేశారు. వెస్ట్ బైపాస్కు చేరుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు భారీగా వచ్చి స్వాగతం పలకడంతో అక్కడ ఐదు నిమిషాలు ఆగారు.
నందిగం ఆధ్వర్యంలో ఘన స్వాగతం
వెంకటపాలెం టోల్గేటు వద్దకు వచ్చే సరికి మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నాయకులు నందిగం సురేష్ ఆధ్వర్యంలో రాజధాని ప్రజలు భారీగా తరలి వచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలికి భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. మహిళలు, యువకులు పూలవర్షం కురిపించారు. కాన్వాయ్లో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలతోపాటు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కొమ్మూరు కనకారావు తదితరులు ఉన్నారు.
అడుగడుగునా అడ్డంకులు
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. తాడేపల్లి నివాసం నుంచి జగన్ కాన్వాయ్ బయలుదేరింది. భరతమాత సెంటర్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ను ముందుకు కదలనిచ్చి వెనుక వస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. తాడేపల్లి ఓల్డ్ టోల్గేటు వద్ద, వెస్ట్ బైపాస్ ఎంట్రన్స్లో వెంకటపాలెం వద్ద జగన్ కాన్వాయ్ను ముందుకు పంపి మిగిలిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అరగంట సేపు ప్రతి ఒక్కచోట అరగంట సేపు వాహనాలను నిలిపివేసి ఆటంకాలు కల్పించారు.
ఫ్లెక్సీలతో యువత కేరింతలు
వైఎస్ జగన్ ఇంటి నుంచి బయటకు రాగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోయింది అధికారం అని, అభిమానం కాదు అంటూ ఫ్లెక్సీలతో యువకులు నృత్యాలు చేశారు. వైఎస్ జగన్ అభిమాని ఒకరు వేంకటేశ్వరస్వామి చిత్రపటంతోపాటు సత్యమేవ జయతే అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. బాణాసంచా కాలుస్తూ ముందుకు సాగారు.
జనమే..అభిమానమై


