ఎయిడెడ్ పాఠశాలల్లో హిందీ పండిట్ పోస్టుల భర్తీకి దరఖాస
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరంలోని రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో రెండు గ్రేడ్–2 హిందీ పండిట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిపై భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా బుధవారం ఓప్రకటనలో తెలిపారు. అరండల్పేట 10వ లైనులోని రెసిడెన్షియల్ ఆదివాసీ ప్రాథమికోన్నత పాఠశాల, శ్రీనివాసరావుపేటలోని శ్రీరవీంద్రనాద్ ఠాగూర్ కమిటీ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కాంట్రాక్టు పద్దతిపై మూడేళ్లు పని చేసేందుకు హిందీ పండిట్ శిక్షణతో పాటు టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు సంబంధిత పాఠశాలల కరస్పాండెంట్లకు వ్యక్తిగతంగా, లేదా సీఎస్ఈ.ఏపీ.ఇన్/ఎయిడెడ్రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తుదారులకు జీవోఎంఎస్ 58 ప్రకారం ఏకీకృత జాబితాను డీఈఓ పోర్టల్లో ప్రచురించి, నియామక పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటల నుంచి అవబృధ స్నానం, చక్రతీర్థం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, ఋత్విక్ సమ్మానం, వేదాశీర్వాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
వాడరేవు తీరంలో మృతదేహం లభ్యం
చీరాల: వాడరేవు సముద్రతీరంలో బుధవారం ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు ఈపూరుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరుపాలెం ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మీడియా గ్రూపుల్లో పోస్టు చేయడంతో వృద్ధుడి వివరాలు లభించాయి. మృతుడు గ్రంధి గణపతిరావు (70) రామకృష్ణాపురం పంచాయతీ కొత్తపాలెం వాసిగా గుర్తించారు. అయితే మృతుడు మంగళవారం సాయంత్రం 4గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తెలిపారు. అనంతరం సముద్రతీరంలో శవమై కనిపించడంపై దర్యాప్తు చేపట్టారు.


