అమరావతిలో సినీ దర్శకుడు బోయపాటి సందడి
తాడికొండ: అమరావతిలో దర్శకుడు బోయపాటి శ్రీను సందడి చేశారు. అఖండ–2 విజయోత్సవంలో భాగంగా తుళ్లూరు తులసీ థియేటర్కు విచ్చేసిన ఆయనకు బాలయ్య, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. కేక్ కత్తిరించారు. బోయపాటి మాట్లాడుతూ అమరావతికి రావడం చాలా సంతోషగా ఉందని చెప్పారు. చాలా చోట్లకు సక్సెస్ మీటింగ్స్ మాత్రమే వెళ్లానని, అభిమానులు, సినిమా అభిమానులను మాత్రమే చూశాను కానీ తుళ్లూరు థియేటర్లో గొప్ప విషయం చూశానని అది అమరావతి కోసం ఫైట్ చేసిన రైతులను చూసాను నాకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. థియేటర్ నిండా అమరావతి కోసం, హక్కుల సాధన కోసం పోరాడిన రైతులు, అలానే ముఖ్యంగా ప్రత్యేకించి మహిళలు ఐదు ఏళ్లు ఫైట్ చేసిన ప్రతి ఒక్కరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నట్లు అభిమానులపై ప్రకటించారు. కార్యక్రమంలో ఆయన వెంట బాలకృష్ణ యువసేన జిల్లా అధ్యక్షులు నెలకుదిటి చందు ఉన్నారు.
నగరంపాలెం: ప్రకృతి సమాజ చిత్రాలు యరగ్రుంట్ల పాణిరావు కవితలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. బ్రాడీపేట కొరటాల సమావేశ మందిరంలో ‘నీరెళ్లిపోతున్నా నది నాతోనే’ కవిత సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. అమరావతి సాహితీ మిత్రులు అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు అధ్యక్షత వహించారు. యరగ్రుంట్ల పాణిరావు కవితల సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జీవ లక్షణం ఉన్న కవి పాణిరావు అని అన్నారు. జ్ఞాపకాలను చాలా అందంగా చిత్రించారని చెప్పారు. మానవ సంబంధాలను అద్భుతమైన బావుకత జోడించి బాగా చెప్పారని పేర్కొన్నారు. సాహితీవేత్త అబ్దుల్ రజాహుస్సేన్ మాట్లాడుతూ ప్రజలను మేలుకొలిపే కవిత్వంగా ఉందన్నారు. చక్కని ఆలోచనలు ఉన్న కవిత్వంగా, మంచి కవిత్వం అందించిన కవి అని కొనియాడారు. ప్రత్యేక అతిథిగా విమల సాహితీ వేదిక(హైదరాబాద్) అధ్యక్షులు డాక్టర్ జెల్ది విద్యాధరరావు మాట్లాడుతూ నవ్యత, మానవత, ఆకుపచ్చని జ్ఞాపకాలతో కవిత్వ సంపుటి పరిమళాలు వెదజల్లుతూ ఉందని అన్నారు. అనంతరం కవి యరగ్రుంట్ల పాణిరావుని సత్కరించారు. సభలో సురేష్, జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు, సాహితీ ప్రియులు, బంధువులు పాల్గొనగా, తొలి ప్రతిని కవి తన సోదరి వాణీ సుమకు అందించారు.
లక్ష్మీపురం: 104 ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ఆయన కార్యాలయంలో ఆదివారం కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ చాలిచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అరబిందో నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం అన్నారు. ప్రస్తుత భవ్య యాజమాన్యం కూడా ఇప్పటివరకు నియామక పత్రాలు కానీ, పే స్లీప్స్ కూడా ఇప్పటి వరకు ఉద్యోగులకు అందజేయలేదని వివరించారు. ఈ విషయాలపై చర్చించి తగు న్యాయం చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ హర్ష, నాయకులు హరి, విజయ్ పాల్గొన్నారు.
వేమూరు: విద్యుదాఘాతంతో కొడుకు మృతి చెందడంతో తండ్రి తట్టుకోలేక రైలు కింద పడి మృతి చెందిన కుటుంబాన్ని రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి పరామర్శించారు. మండల కేంద్రంలోని బేతాలు పురం గ్రామానికి చెందిన అట్లూరు సునీల్ విద్యుదాఘాతంలో శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీన్ని తట్టుకోలేని తండ్రి అట్లూరు వెంకయ్య సాయంత్రం రైలు కింద పడి మృతి చెందాడు. ఒకే కుటుంబంలో కొడుకు, తండ్రి మృతి చెందడంతో గ్రామ ప్రజలు, అధికారులు అందోళనకు గురయ్యారు. రెండు మృత దేహాలను పోస్టుమార్టం కోసం తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం గ్రామస్తులకు అప్పగించారు. రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెనాలి ప్రభుత్వ ఆసుత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరగా చేయించారు. అనంతరం బేతాలు పురం గ్రామానికి వెళ్లి మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే కుటుంబంలో కొడుకు, తండ్రి మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్కు పెళ్లి అయి సంవత్సరమే అయిందని, భార్య నిండు గర్భిణితో ఉందని ఆమె చెప్పారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నిధులతో ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులు పొలాల్లో కరెంట్ లైన్ల మరమ్మతులపై అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు సుశీల, వీఆర్వోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతిలో సినీ దర్శకుడు బోయపాటి సందడి
అమరావతిలో సినీ దర్శకుడు బోయపాటి సందడి


