విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి

Jun 10 2025 6:56 AM | Updated on Jun 10 2025 6:56 AM

విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి

విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: చదువులో ప్రతిభ చూపి, ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు స్థిరమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల నుంచి టెన్త్‌, ఇంటర్మీడియెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 150 మంది విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ప్రతిభా పురస్కారాలు అందించారు. పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్‌ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడారు. పాఠశాల విద్యలో మండలాల వారీగా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల నుంచి టెన్త్‌లో 112 మంది, ఇంటర్మీడియెట్‌లో 38 మంది చొప్పున 150 మంది విద్యార్థినీ, విద్యార్థులను షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికీ రూ.20 వేలు నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందిస్తున్నట్లు వివరించారు. మండలానికి ఆరుగురు చొప్పున టెన్త్‌లో 600 మార్కులకు 500కు పైబడిన విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్‌లో 830కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. షైనింగ్‌ స్టార్‌ అవార్డులు పొందిన విద్యార్థులతో పాటు కృషి చేసిన ఉపాధ్యాయులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, పాఠశాల విద్య, ఇంటర్‌ విద్య ఆర్జేడీలు లింగేశ్వరరెడ్డి, జె.పద్మ, డీఈవో సీవీ రేణుక, ఆర్‌ఐవో జీకే జుబేర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్‌ కె.వెంకట్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్‌, సమగ్ర శిక్ష ఏపీసీ పద్మావతి, డీవైఈవోలు సీహెచ్‌. ఏసురత్నం, నిర్మలకుమారి, ఎంఈవోలు పాల్గొన్నారు.

సీఎం, లోకేష్‌లపై పొగడ్తలు

ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో విద్యాశాఖాధికారులు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను తెగ పొగిడించారు. రాష్ట్రంలో విద్యారంగం కొత్తగా ఏడాది వ్యవధిలోనే అభివృద్ధి చెందినట్లు, వీరిద్దరే కారకులన్నట్లుగా పొగడ్తలతో ముంచెత్తడం తల్లిదండ్రులను విస్మయానికి గురి చేసింది.

ప్రైవేటు విద్యార్థులే అధికం

జిల్లాలో షైనింగ్‌ స్టార్‌ అవార్డులకు ఎంపిక చేసిన 150 మంది విద్యార్థుల్లో 116 మంది ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివిన వారే ఉన్నారు. ప్రభుత్వ రంగంలో చదివిన పేద కుటుంబాలకు చెందిన కేవలం 34 మందిని మాత్రమే ఎంపిక చేసింది. ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, విద్యాశాఖ ప్రైవేటు, కార్పొరేట్‌కే పట్టం కట్టింది. అవార్డులు అందుకున్న 112 మంది టెన్త్‌ విద్యార్థుల్లో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 85 మంది ఉండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 27 మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా 38 మంది ఇంటర్‌ విద్యార్థుల్లో 31 మంది ప్రైవేటు, ఏడుగురు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు.

కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement