
వెన్నుపోటు చంద్రబాబుకు అలవాటే..!
నెహ్రూనగర్: వెన్నుపోటు అంటే గుర్తుకువచ్చేది చంద్రబాబే అని నాడు ఎన్టీఆర్ను.. నేడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని మోసం చేసి చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. జూన్ 4న జరగనున్న వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేసేందుకుగాను సోమవారం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సన్నాహక సమావేశం స్థానిక బస్టాండ్ ఎదురుగా గల తూర్పు కార్యాలయంలో జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అధ్యక్షతన వహించారు. అంబటి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం అమలుకాని హామీలు ఎన్నో ఇచ్చారన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలనైనా అమలు చేస్తున్నారా.. అంటే వాటిని కూడా నిలిపివేశారన్నారు. జూన్ 4న జరిగే వెన్నుపోటు దినాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి చంద్రబాబు మెడలు వంచైనా సరే సంక్షేమ పథకాలను అమలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తెనాలిలో యువకులను పోలీసులు విచక్షణ రహితంగా కొడితే వారిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తుంటే.. గంజాయి, రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తారా అంటూ హోంమంత్రి మాట్లాడటం బాధాకరమన్నారు.
చంద్రబాబు హామీలు నీటిమీద రాతలు
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ నీటి మీద రాతలేనన్నారు. ఆయన హమీలు ఇచ్చారంటే అమలు కావానే అర్థమన్నారు. పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీకి రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని.. కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. పార్టీ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నూరిఫాతిమా మాట్లాడారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నాడు ఎన్టీఆర్కు..నేడు హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు
బాబు మోసాలను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్నేందుకే వెన్నుపోటు దినం కార్యక్రమం
ప్రజలంతా పాల్గొని చంద్రబాబు మెడలు వంచైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అంబటి రాంబాబు