
పేద్ద మొత్తంలో అవినీతి!
పట్నంబజారు: గుంటూరు నగరంలోని లాలాపేటలో వేంచేసియున్న శ్రీ వేంటేశ్వరస్వామి గ్రూప్ ఆలయాల పరిధిలో నాజ్ సెంటర్లోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం, శ్రీ జగన్నాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయాలకు సంబంధించి పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) విధానంలో పలు అవకతవకలు జరిగాయని సమాచారం. 2015కు సంబంధించి సిబ్బందికి ఇవ్వాల్సిన పీఆర్సీని 2024లో ఇచ్చారు. అయితే దేవదాయ శాఖకు స్వయంప్రతిపత్తిగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే పీఆర్సీ కూడా ఇవ్వొచ్చని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఆలయ అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి అత్యుత్సాహం కారణంగా, మొత్తం గ్రూప్ ఆలయాల్లో 19 మంది సిబ్బందికిగానూ.. ఏడుగురికి ఇవ్వాల్సిన దానికంటే అధిక మొత్తాలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు అధికారి సిబ్బందిని భయపెట్టి, తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తామని లేఖలు రాయించుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆలయాలకు సంబంధించి వచ్చిన ఆదాయంలో 28 శాతం కంటే అధికంగా ఉంటే పీఆర్సీలు ఇచ్చేందుకు వీలు లేదని చెబుతున్నారు. 2020 సంవత్సరంలో ఆరుగురు అర్చకుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడి పెద్ద ఎత్తున పీఆర్సీలు ఇవ్వటంతో గ్రూప్ ఆలయాల ఖర్చు 52 శాతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆలయ అధికారిగా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) అధిక శాతం పీఆర్సీ పడిన వారి నుంచి తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది. నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గతంలో పనిచేసిన సదరు అధికారి తప్పిదాన్ని ఆడిట్ అధికారులు ఆక్షేపించినట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఆలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు భక్తులకు మరింత తలనొప్పి తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా ఆంజనేయస్వామి ఆలయంలో లడ్డు, ఇతర పూజలకు సంబంధించి టోకెన్లు కొట్టే వ్యక్తి ఉదయం 8 గంటలకు రాకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ఆలయంలో సిబ్బందే చెబుతున్నారు.
పే రివిజన్ కమిషనర్ విధానంలో అవకతవకలు అధికమొత్తంలో అందుకున్న పలువురు దేవదాయ ఉద్యోగులు తిరిగి ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు రంగం సిద్ధం
నేను ఇంకా చూడలేదు
నేను ఇంకా ఈ అంశంపై దృష్టి పెట్టలేదు. స్పష్టంగా మీకు కావాల్సింది పేపరుపై రాసి ఇస్తే.. కావాల్సిన సమాచారం ఇస్తాం. ఆడిట్ ఆక్షేపించిన అంశం నాకు తెలియదు. ప్రస్తుతానికి నోటీసులు వరకు రాలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఆడిట్ అబ్జక్షన్స్ ఉంటే కచ్చితంగా దానిపై దృష్టి సారిస్తాం. – టి. సుభధ్ర ఏసీ,
లాలాపేట గ్రూప్ ఆలయాలు