
జీడీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతల స్వీకరణ
నగరంపాలెం: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (జీడీసీసీబీ) పర్సన్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గురువారం గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణాల మంజూరులో సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వ్యవసాయ శాఖ ద్వారా నల్ల బెర్లీ పొగాకుపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. విత్తనాలు అందించేందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, భాష్యం ప్రవీణ్, టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు నన్నపనేని రాజకుమారి, బ్యాంక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడే సమయంలో ఒకట్రెండు సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయన మీడియా, సెల్ఫోన్ లైట్ల వెలుగులో మాట్లాడారు. ఆ తర్వాత కూడా పలుమార్లు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో వచ్చిన వారు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు.
రైతులకు సేవ చేస్తా..
రైతులకు సేవ చేస్తానని గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ పర్సన్ ఇన్చార్జి వడ్రాణం హరిబాబు అన్నారు. గుంటూరు కన్నవారితోటలోని జీడీసీఎంఎస్ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ ద్వారా రైతులకు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తామన్నారు. గిట్టుబాట ధర కల్పించేలా చూస్తామని చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ఎలక్ట్రికల్ బస్సుల పెంపుదల, అదనపు సిబ్బందిని నియమిస్తామని అన్నారు. అనంతరం హరిబాబుని మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు అభినందించారు.

జీడీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతల స్వీకరణ

జీడీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతల స్వీకరణ