
అర్జీదారులను పదే పదే తిప్పుకోవద్దు
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను అధికారులు పదే పదే తమ కార్యాలయాలకు తిప్పుకోవద్దని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా రోజుల తరబడి వేచి చూస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలు వినాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పారు. ప్రజలు కూడా అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చని, దీంతో ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని, సమస్యల పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని అధికారులకు తెలిపారు. అనంతరం వచ్చిన 190 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ