భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

May 13 2025 2:05 AM | Updated on May 13 2025 5:22 PM

గుంటూరు రూరల్‌: భర్త వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న ఆమె మృతదేహాన్ని పలు నాటకీయ పరిణామాల మధ్య అంబులెన్స్‌లో గుంటూరు శివారు ఓబులనాయుడుపాలేనికి తరలించడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... ప్రత్తిపాడు మండల యనమదల గ్రామానికి చెందిన హేమలతకు 2020లో ఓబులనాయుడుపాలెం గ్రామానికి చెందిన మురళీతో కులాంతర వివాహం జరిగింది. 

హేమలత హైదరాబాదులోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. పెళ్లి అనంతరం కాపురాన్ని హైదరాబాద్‌ లింగంపల్లి ప్రాంతానికి మార్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త మురళి జులాయిగా తిరుగుతూ, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. డబ్బులు కోసం నిత్యం భార్యను వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. చేసేదిలేక హేమలత తన శక్తికి మించి రుణాలు చేసి అడిగిన మొత్తం సర్దుబాటు చేసేది. ఇటీవల భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. ఆదివారం భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు. హేమలత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పకుండా భర్త ఆమె మృతదేహాన్ని నేరుగా అంబులెన్స్‌లో ఓబులనాయుడుపాలేనికి తీసుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న హేమలత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వంశీధర్‌ ఆదేశాల మేరకు ఎస్‌.ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జీరో ఎఫ్‌ఐర్‌ చేసి కేసును హైదరాబాద్‌ చందానగర్‌ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement