కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.పాండురంగవిఠల్
గుంటూరు మెడికల్ : సరిహద్దులలో భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంతో పాటు అనేక పట్టణాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.పాండురంగవిఠల్ తెలిపారు. బీజేపీ గుంటూరు రూరల్ మండలం అత్యవసర సమావేశం శుక్రవారం అధ్యక్షుడు కంచర్ల రాజేష్ అధ్యక్షతన బ్రాడీపేటలోని కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పాండురంగవిఠల్ మాట్లాడుతూ ప్రస్తుతం స్లీపర్సెల్స్ దేశం వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, గుంటూరు పట్టణంలోనూ వారు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలు సంచరిస్తున్నారని వార్తలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు వెంటనే దీనిపై విచారణ చేసి వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తీర్పులెప్పుడూ చట్టాలకు లోబడే ఉండాలి
గుంటూరు లీగల్: జిల్లా కోర్టులోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలకు శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జూనియర్ సివిల్ న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమానికి ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి జి.చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు (పీడీఎం) న్యాయమూర్తి వి.దీప్తి, మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం.జగదీశ్వరి, రెండవ అదనపు జూనియర్ కోర్టు న్యాయమూర్తి డి.ధనరాజ్, నాల్గవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి, ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి మేరీ శారా ధనమ్మ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి చక్రపాణి న్యాయమూర్తుల విధివిధానాలను వివరించారు. తీర్పులు చేప్పేటప్పుడు అపోహలకు గురి కావద్దని తెలిపారు. అవి ఎప్పుడూ చట్టాలకు లోబడి ఉండాలని, పరిధిని దాటొద్దని సూచించారు.
న్యాయవాదులను జూనియర్, సీనియర్ అంటూ చూడొద్దని, అంతా సమానమేనని తెలిపారు. కేసు చేసే విధానాన్ని బట్టి తీర్పు ఇవ్వాలని చెప్పారు.గుంటూరు కోర్టుకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉందని, ఇక్కడి న్యాయవాదులు మంచి నైపుణ్యత కలిగిన వారని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా కేసుల్లో నైపుణ్యాన్ని కనబరుస్తారని కొనియాడారు. గతంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఎం.శోభారాణి మరలా నాలుగవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా రావటం అభినందనీయమన్నారు. పలువురు నాయమూర్తులు మాట్లాడుతూ గుంటూరు కోర్టులలో పని చేయడానికి గర్వపడుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.