గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తొమ్మిది మండల ప్రజా పరిషత్లకు సంబంధించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యలో ఉప ఎన్నికల నిర్వహణపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. జెడ్పీలోని తన చాంబర్లో జరిగిన సమావేశంలో జ్యోతిబసు మాట్లాడుతూ ఈనెల 27న మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసి, అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే విధానంపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సన్నాహక ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులతో పాటు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శిక్షణ నిర్వహించారు. పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు, దుగ్గిరాల, గుంటూరు రూరల్, తెనాలి, అచ్చంపేట, కారంపూడి, నరసరావుపేట, ముప్పాళ్ల ఎంపీడీవోలతోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధిత జిల్లా కలెక్టర్లచే నియమించిన ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. బాపట్ల మండలం పిట్టలవానిపాలెం మండల అధ్యక్ష ఎన్నికకు బాపట్ల డీఎల్డీవో విజయలక్ష్మి, భట్టిప్రోలు కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు బాపట్ల డీఏహెచ్వో వేణుగోపాలరావు, దుగ్గిరాల మండల అధ్యక్ష ఎన్నికకు గుంటూరు డ్వామా పీడీ శంకర్, గుంటూరు రూరల్ ఉపాధ్యక్ష ఎన్నికకు ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, తెనాలి కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు హ్యాండ్లూమ్స్ ఏడీ ఉదయ కుమార్, అచ్చంపేట మండల అధ్యక్ష ఎన్నికకు క్రోసూరు వ్యవసాయశాఖ ఏడీ హనుమంతరావు, కారంపూడి ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డ్వామా పీడీ లింగమూర్తి, నరసరావుపేట ఉపాధ్యక్ష ఎన్నికకు పల్నాడు డీఏఓ ఐ.మురళి, ముప్పాళ్ల కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నికకు పల్నాడు డీఏహెచ్వో కె.కాంతారావు ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులయ్యారు. గురజాల డీఎల్డీవో గభ్రూ నాయక్, పెదకాకాని ఈవోపీఆర్డీ కె.శ్రీనివాసరావు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు.