కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమంలో తనపై దాడి చేశారంటూ సంబంధం లేని వ్యక్తులపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. యువత పోరు కార్యక్రమంలో భాగంగా భారీగా తరలివచ్చిన యువత కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై బైక్ ర్యాలీగా వస్తున్న సమయంలో వెస్ట్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ సుభానిబాబు అత్యుత్సాహం చూపించారు. యువకులను అడ్డుకునే యత్నం చేశారు. అయినా యువకులు ముందుకు కదిలారు. అయితే ఆ సమయంలో వైఎస్సార్ సీపీ నాయకుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, మరికొందరు తనపై దాడి చేశారంటూ హెడ్ కానిస్టేబుల్ సుభాని నగరంపాలెం పోలీసు స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. వాస్తవానికి హెడ్కానిస్టేబుల్ యువకులను అడ్డుకున్న సమయంలో ఉమామహేశ్వరరెడ్డి అక్కడ లేరు. అయినా అతనిపై, అతని అనుచరులపై ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం విస్మయం కలిగించింది.
పత్తి మిల్లు సీజ్..
లోపల చిక్కుకున్న ఇద్దరు బిహార్ కూలీలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రుణం చెల్లించలేదని ఓ బ్యాంక్ నిర్వాహాకులు పత్తి మిల్లుకు తాళాలు వేశారు. అయితే అందులో చిక్కుకున్న ఇద్దరు కూలీలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలను లాలాపేట పోలీసులు చేశారు. ఏటుకూర్ రోడ్లోని ఓ పత్తిమిల్లు నిర్వాహకులు గతంలో కొత్తపేటలోని ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు. అయితే మిల్లు నిర్వాహకులు సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు బుధవారం మధ్యాహ్నం మిల్లుకు తాళాలు వేసి సీజ్ చేశారు. మిల్లు లోపల బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు దినేష్, ఉమేష్ ఉండిపోయారు. ఈ విషయమై లాలాపేట పోలీసుల దృష్టికి తోటి కూలీలు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరిపి కూలీలను బయటకు తీసుకొచ్చారు.
సిమెంట్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
జె.పంగులూరు: వేగంగా ప్రయాణిస్తూ నిద్ర మత్తులోకి జారుకొని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని రేణింగవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. రేణింగవరం ఎస్ఐ వినోద్బాబు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాపట్నం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున రేణింగవరం సమీపంలోకి వచ్చింది. ఆదే సమయంలో డ్రైవర్ కె. శేఖర్ నిద్రమత్తులోకి జారుకుని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొట్టాడు. వెంటనే తేరుకొని ఎడమవైపు బస్సును తిప్పడంతో పొలాల్లోకి వెళ్లింది. బస్సు ముందువైపు భాగంగా బాగా దెబ్బతింది. బస్సు డ్రైవర్ శేఖర్ కాళ్లకు బాగా గాయాలయ్యాయి. సీటు వద్ద ఇరుక్కుపోయాడు. హైవే సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీశారు. డ్రైవర్ది చిత్తూరు జిలా నెమలికుంట గ్రామం. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, వారిని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్ఐ వినోద్బాబు తెలిపారు. డ్రైవర్ శేఖర్ను అద్దంకి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధం లేని వ్యక్తులపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు
సంబంధం లేని వ్యక్తులపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు