మాటలేనా? మద్దతిస్తుందా? 

Kommineni Srinivasa Rao Article On Andhra Pradesh Partition Issue - Sakshi

విశ్లేషణ 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు జాతీయ అంశాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనడం ద్వారా ఏపీ విభజన వ్యవహారం ప్రాముఖ్యతను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లయింది. కానీ ఆ దిశగా చొరవ చూపి, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించినప్పుడే కేంద్రం తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించినట్లు! ఏపీకి ప్రత్యేక హోదా అంశం పట్ల గత సీఎం చంద్రబాబు నాలుగు రకాలుగా స్పందించి నవ్వుల పాలవడం వల్ల అది నాన్‌ సీరియస్‌ వ్యవహారానికి తగ్గిపోయింది. అప్పుల విషయంలోగానీ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని సమస్యల పట్లగానీ జగన్‌ వైఖరి స్పష్టంగా ఉంది. మరి ఆ దిశగా కేంద్రం కూడా అంతే స్పష్టంగా ఉంటుందా, అన్ని రకాలుగా ఆదుకుంటుందా అన్నది చూడాలి. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు కేవలం ఆ రాష్ట్రాలకే పరిమితం కాదనీ, జాతీయ అంశాలు అనీ అనడం ద్వారా ఏపీ విభజన వ్యవహారం ప్రాముఖ్యతను ఆయన అంగీకరించారు. తద్వారా విభజన సమస్యలకు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్న భరోసా కూడా ఇచ్చినట్లు అయింది. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అమిత్‌ షా ఈ హామీ ఇచ్చారు. నిజానికి ఈ పని ఎప్పుడో జరిగి ఉండాల్సింది. కాలం గడిచేకొద్దీ సమస్యల పరిష్కారం కష్టసాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య పరిస్థితి అదే రకంగా ఉంది. ఒక పక్క విభజన సమస్యలు, మరో వైపు నదీ జలాల వివాదాలు పెరుగుతున్నాయే గానీ తేలడం లేదు. 

ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న సంస్థల ఆస్తులపై ఇంత వరకు ఏమీ తేలలేదు. దాంతో తెలంగాణకు పెద్ద నష్టం లేదు. కానీ ఏపీకి వాటిని అనుభవించే అవకాశం లేదు. విక్రయించే అవకాశం లేదు. ఆయా సంస్థలలో ఉన్న నిధుల పంపిణీపై సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినా, అది అమలు కావడం లేదు. ఈలోగా తెలుగు అకా డమీ వంటి సంస్థలలో నిధులను కాజేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం విభజన చట్టం కల్పించింది. దాని ప్రకారం 2024 వరకు అలాగే ఉండవచ్చు. ఇందుకు తగ్గట్లుగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు భారీగానే ఖర్చు చేసి ఆయా భవనాలను ఆధునీకరిం చారు.

హైదరాబాద్‌లో ఏపీకి  కేటాయించిన సెక్రటేరియట్‌ భవనా లలో కేవలం తన చాంబర్‌కే కోట్ల రూపాయలను చంద్రబాబు వ్యయం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతలో ఏడాదిలోపే పెద్ద సంచలన ఘటన జరగడం, దాంతో చంద్రబాబు పెట్టేబేడా సర్దుకుని హడావుడిగా విజయవాడ వెళ్లిపోవడం జరిగింది. తెలం గాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు ప్రయత్నించా రన్న ఆరోపణ రావడం, ఆ క్రమంలో అప్పట్లో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు యాభై లక్షలు ఇస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం తెలిసిన సంగతే. 

ఈ ఒక్క ఘటన ఏపీ భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేసిందంటే ఆశ్చర్యం లేదు. ఉమ్మడి రాజధానిపై హక్కు వదలుకోవడం, రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడం తదితర ఘట్టాలు జరిగాయి. చంద్రబాబు అయితే పైస్థాయిలో పైరవీ చేసుకుని కేసీఆర్‌తో రాజీపడి కేసు నుంచి బయటపడ్డారు గానీ, ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పక్కన బెట్టి ప్యాకేజీని తెరపైకి తెస్తే అంగీకరించారు.

పోల వరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టవలసి ఉండగా, తమకు కాంట్రాక్టు నిర్ణయాధికారంతో తామే నిర్మిస్తామని తీసుకున్నారు. విజయవాడలో వివిధ ఆఫీసుల ఏర్పాటుకు అద్దె భవనాలను తీసుకున్నారు. అందుకోసం కోట్లు వ్యయం చేయవలసి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాపై స్పష్టత లేకుండా ఆమోదిం చారు. 2013–14 నాటి వ్యయ అంచనాకు ఒప్పు కోవడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ధరల నిర్ణయంపైనా, భూసేకరణకు పరి హారం చెల్లించడంపైనా ఒక స్పష్టమైన అవగా హనను కేంద్రంతో కుదుర్చుకుని ఉంటే ఇప్పుడు వివాదం అయ్యేది కాదు.

ఈ అంశాలన్నింటి గురించి ఈ జోనల్‌ సమా వేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ హుందాగా ప్రసంగిం చారు. అదే సమయంలో ఎక్కడా రాజీపడ కుండా ఆయా అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పగలిగారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఏమి చెబు తున్నారో అదే పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఒకసారి ప్రత్యేక హోదా కావాలనీ, ఇంకోసారి  అక్కర్లేదనీ, అదేమీ సంజీవని కాదనీ, మళ్లీ ప్రత్యేక హోదా కావాలనీ కేంద్రం వద్ద నవ్వుల పాలయ్యారు.

ఆ అంశానికి సీరియస్‌నెస్‌ లేకుండా చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ కీలక భేటీ లలో ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తా వించకుండా ఉండటం లేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రెండు, మూడు భేటీలలోనూ ఈ అంశం తేల్చాలని గట్టిగా కోరారు. మరో ముఖ్యమైన విషయం. రుణాల పరిమితి, కేంద్రం విధించిన కోత గురించి జగన్‌ కొన్ని ఆస క్తికర విషయాలు వెల్లడించారు.

తెలుగుదేశంకు మద్దతిచ్చే మీడియా ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం రుణాలు ఇష్టం వచ్చినట్లు చేస్తోందనీ, ఫలితంగా కేంద్రం రుణాలలో కోత పెడుతూ షాక్‌ ఇచ్చిందనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గత ప్రభుత్వం 2015–16 నుంచి మితి మీరి, ఎఫ్‌ఆర్‌బీఎంను అతిక్రమించి అప్పులు చేసిందని జగన్‌ స్పష్టంగా  తన ప్రసంగంలో చెప్పారు. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ ఆ విషయాలను పట్టించు కోకుండా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆనాటి తప్పులకు ఇప్పుడు కోత పెడుతున్నారని వెల్లడిం చారు. 42,447 కోట్ల రుపాయల రుణ పరిమితి ఉంటే, 19,923 కోట్ల రుణా లను మినహాయి స్తున్నట్లు కేంద్రం తెలిపిందనీ, వచ్చే మూడేళ్లు రుణ పరిమితిలో కోత పెడుతున్నామనీ పేర్కొ న్నారని వివరించారు. 

ఇంత అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఆధారాలు లేకుండా మాట్లాడజాలరు. చంద్రబాబు టైమ్‌లోని అప్పుల గురించి అదరహో అని ప్రచారం చేసి, ఇప్పుడు చేస్తున్న అప్పుల గురించి నెగెటివ్‌గా ప్రచారం సాగించిన టీడీపీ మీడియా దీన్ని పట్టించుకోకుండా వదిలేసింది. వెనుకబడిన జిల్లాల ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని జగన్‌ నొక్కి చెప్పారు.

వాస్తవానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సుమారు పాతికవేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇవ్వవలసి ఉండగా, వెయ్యి కోట్ల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. విభజన చట్టం ప్రకారం ఇంకా రావల్సిన సంస్థలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను జగన్‌ ప్రస్తావించారు. గతంలో ఏపీ సరఫరా చేసిన విద్యుత్తుకు గాను చెల్లించవలసిన బకాయిల విష యంలో తెలంగాణ ప్రభుత్వం మొండికేసిన వైనాన్ని ప్రస్తావించారు. సుమారు ఆరువేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఏపీ వాదిస్తుంటే, మూడు వేల కోట్ల పైచిలుకు మాత్రమేనని తెలంగాణ అంటున్నది. ఈ సమస్యలపై ఒక కమిటీని వేస్తామని అమిత్‌ షా చెప్పడం ముదావహం.

తిరుపతిలో ఈ సమావేశం జరిగింది కనుక ఈ విషయాలకు ప్రాధాన్యత వచ్చింది. అమిత్‌ షా కూడా కొంత ఎక్కువ దృష్టి పెట్ట గలిగారు. కానీ ఆయన ఢిల్లీ వెళ్లిపోయాక, దీనికి ఫాలో అప్‌ లేకపోతే ఏపీకి ఒనగూరే ప్రయోజనం ఉండదు. విభజన సమ యంలో తెలంగాణ తలసరి ఆదాయం 15 వేల రూపాయలకు పైగా ఉంటే, ఏపీ తలసరి ఆదాయం 9 వేల లోపే ఉంది. హైదరా బాద్‌ మాదిరి ప్రధాన నగరం ఏపీలో లేదు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఏపీకి కేంద్రం సాయం చేయాలని జగన్‌ కోరడం బాగానే ఉంది. వీటితో పాటు విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక కారి డార్‌ తదితర అంశాలకు కూడా కేంద్రం ప్రాధాన్యం ఇస్తే ఏపీకి ప్రయో జనం ఉంటుంది.

అమిత్‌ షా చెప్పినట్లు ఇవి జాతీయ అంశాలే. విభజన సమయంలో పార్లమెంటులో ప్రకంపనలు వచ్చాయి. తెలం గాణ ఎంపీలు విభజన కోరుతూ, ఏపీ ఎంపీలు వ్యతిరేకిస్తూ ఆందో ళనలకు దిగడంతో పార్లమెంటు స్తంభించింది. అయినా ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్లు పెట్టడం, దానికి బీజేపీ సహకరించడం, గందరగోళం మధ్యే బిల్లు ఆమోదం పొందడం జరిగాయి. కేంద్రానికి చెందిన కొన్ని విద్యాసంస్థలను ఇచ్చినా, వాటికి అవసరమైన నిధు లను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారన్న భావన ఉంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్రం ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి తగు రీతిలో ఆదు కుంటే ఎపీ నిలదొక్కుకుంటుంది.


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు      
కొమ్మినేని శ్రీనివాసరావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top