
పన్నెండు వందలమంది ఆత్మబలిదానాలతో, వందలాదిమంది విప్లవకారుల పరోక్ష త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాసుకున్న వారిదే చరిత్రగా, దోచుకున్న వారిదే సంపదగా దిగజారుతుండగా... 2025 జూన్ 2న మనం పుష్కర తెలంగాణలో అడుగుబెడుతున్నాం. కడుపులు ఎండుతున్న వారి దుఃఖానికి బదులు, కడు పులు నిండిన వారి ఆక్రోశాలు వార్తలవుతున్న సమ యంలో అసలు ఈతి బాధలెవరివో, రాజ భోగా లెవరివో మాట్లాడుకోవాల్సి రావడమే అత్యంత విషాదం. ఆంతరంగిక వలస విముక్త అవగాహ నతో, ప్రాంతీయ ప్రజాస్వామిక నినా దంతో, ఆత్మగౌరవ పతాకతో, సాంస్కృతిక అస్తిత్వ గానంతో తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు ప్రాణం పోసిన విప్లవోద్యమం లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు.
1969లో మున్నూట అరవై మంది ప్రాణాలను బలిగొని తెలంగాణ ఉద్య మాన్ని అణిచివేస్తే, విప్లవోద్యమం సార్వజనీన ప్రజా విముక్తి ఆశగా అప్రతిహతంగా పెరుగుతూ వచ్చింది. తిరిగి విప్లవోద్యమాన్ని నెత్తుటేర్లలో ముంచిన ప్రపంచీకరణ విధానాల తర్వాత అనేక కష్టనష్టాల మధ్య కూడా ఆ విప్లవోద్యమమే తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు ప్రాణ ప్రతిష్ఠ చేసింది.అందుకే వీరన్నలను, పోరన్నలను, ఐలమ్మలను ఆదర్శంగా ప్రకటించిన పాలక పార్టీలు నక్సలైట్ ఎజెండానే తమ ఎజెండాగా ప్రకటించాల్సివచ్చింది. వారి దేశభక్తిని ఆకాశానికెత్తాల్సివచ్చింది. చివరకు ముఖ్యమంత్రి పదవి కంటే పౌరహక్కుల సంఘం అధ్యక్ష పదవి గొప్పదని ప్రకటించేదాకా పోయారు.
లక్షల మంది ఉద్యమ కార్యకర్తల కృషిని అంగీకరించకుండా తెలంగాణ తెచ్చామంటున్నవారు, తెలంగాణ ఇచ్చామంటున్న వారు... ఇద్దరూ ఇప్పుడు మన ముందు పాలకులుగా, ఏలికలుగా ఉన్నారు. అందుకే టీఆర్ఎస్/ బీఆర్ఎస్ పదేళ్ల పాలనను, ఒకటిన్నర సంవత్సర కాల కాంగ్రెస్ పాలన తీరును బేరీజు వేసుకుంటూ భవిష్యత్ తెలంగాణను ఎట్లా తీర్చి దిద్దుకోవాలో ఆలోచించుకోవడానికి ఒక మంచి సందర్భం కూడా ఇదే. తెలంగాణలో భూమి సమస్యను తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున లేవనెత్తింది. ఆ తర్వాతి ఆదివాసీ, విప్లవోద్యమాలూ దీనిపైనే ప్రధానంగా సాగాయి.
అయితే పాలకులు భూపంపిణీని విస్మరించి నీళ్ల సమస్యను పాపులర్ నినాదం చేశారు. భూమిని సరుకుగా మార్చి... రియల్ ఎస్టేట్ వ్యాపారులను తలదన్నే విధంగా ప్రభుత్వమే భూములు అమ్మే పక్కా వ్యాపార వేత్తగా అవతారం ఎత్తింది. ప్రజా ప్రతిపక్షంగా నిల బడ్డ శక్తులమైనా కలసికట్టుగా ప్రపంచీకరణ రుద్దిన విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఐక్యంగా ప్రతి ఘటించలేకపోతున్నాం. అందుకే ‘ఆరు గ్యారెంటీ ల’తో పాటు ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ అనే ఏడో హామీ కూడా ప్రజలను ఒక మేరకు ప్రభావితం చేసింది. అందుకే ఒక పుష్కర కాలంలోనైనా వీటిని బేరీజు వేసుకుంటూ ఆర్థిక విధానంతో పాటు, హక్కుల విషయం, కేసుల ఎత్తివేత వంటి అంశాలలో కూడా ప్రభుత్వాలు రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సిందే.
తెలంగాణలో కులగణన ఆధారంగా ‘మేమెంతో మాకంత’ అనే సామాజిక న్యాయం ఆచరణ మార్గం పట్టించాలి.ఒక ప్రజా సాంస్కృతిక కార్యకర్తగా ఆరు పదులు నిండిన నా జీవితంలో 50 ఏళ్లు ప్రజా పాటలతో ముడిపడి ఉంటే, అందులో 30 ఏళ్ల చైతన్య పూరిత జీవితమంతా (1995–2025) ప్రధానంగా తెలంగాణ సాంస్కృతిక–రాజకీయ ఉద్యమాలతోనే ముడివడి ఉంది. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాల మూరు లోనా/ మన తెలంగాణ లోనా’ అంటూ మొదలై ‘దగాబడ్డ మన తెలంగాణలో సంఘ మొకటి పెడుదాం/సంగతేందో చూద్దాం’ అనే పిలుపులో పిలుపునై వేల సభల్లో వందల పాటలు పాడాను. 1996లో ‘తెలంగాణం’ అనే పుస్తకాన్ని, పాటల క్యాసెట్ను విడుదల చేసిన ‘అరుణోదయ’లో కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాను.గొంతులు పచ్చి పుండయినా రాష్ట్రమంతా కలియ తిరిగి పాడాను.
2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనకు ముందే ఉస్మానియా శిబిరాన్ని కాపాడు కోవడంలో, బహుజన బతుకమ్మను తలపై ఎత్తు కోవడంలోనూ, వలస పెత్తందార్ల ఆర్థిక మూలా లను దెబ్బ కొట్టి తెలంగాణ సాధించుకోవాలని చేసిన అనేక మిలిటెంట్ పోరాటాల్లో ముందు బాగాన్నే ఉండి జైళ్ళు–సంకెళ్లు అన్నీ ఎదుర్కొ న్నాము. గాయిదోల్ల తెలంగాణ కావాలని, గరీ బోల్ల తెలంగాణ రావాలని, గారడీ తెలంగాణ వద్దని నినదించాము. ఫలితంగా అక్రమ కేసుల పరంపర, ఆఫీసులకు తాళాలు, అవమానాలు ఎదుర్కొన్నాం.
అయినా ఎవరో గద్దె దిగి, మరొకరు గద్దెనెక్కాలని కాకుండా తెలంగాణలో సామాజిక న్యాయం పరిఢవిల్లాలని పోరాడాము.చరిత్ర నిర్మాతలు ప్రజలని చాటుతూ నవ తెలంగాణ నిర్మాణం కోసం, సామాజిక న్యాయా నికై గొంతెత్తడమే మన కర్తవ్యం. నిజమైన పోరాట కారుల చరిత్ర ప్రజా తెలంగాణలోనే సాధ్యం. అప్పుడే దోచుకున్న సంపద ప్రజల సొంతమవు తుంది. అమరులు కన్న నిజమైన ప్రజా తెలంగాణ కల సాకారమవుతుంది.
వ్యాసకర్త టీయూఎఫ్ అధ్యక్షురాలు ‘అరుణోదయ’ విమలక్క