ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్! | TVK Chief Vijay Visited The Tiruchendur Murugan Temple | Sakshi
Sakshi News home page

ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!

May 5 2026 1:31 PM | Updated on May 5 2026 1:58 PM

TVK Chief Vijay Visited The Tiruchendur Murugan Temple

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన  కొద్దిరోజుల ముందు  తమిళగ వెట్రి కళ‌గం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్‌ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. 

ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

ఈ తిరుచెదూర్‌ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్‌ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్‌ ఆలయం. మరుగన్‌ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది.  ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం.  

చరిత్ర..
ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్‌ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్‌తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.

ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్‌ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్‌ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 

వెనక్కి తగ్గిన సునామీ..
2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్‌లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.

ఆలయ ఆచారాలు..

ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.

దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.

ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.

ఎలా చేరుకోవాలంటే..

సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.

మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.

(చదవండి: సంచలనాల టీవీకే విజయ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే! ర్యాలీలో సైతం..)
 

Advertisement
 
Advertisement
Advertisement