జిలేబీ జర్నీ..! భారత్‌కు ఎలా వచ్చిందో తెలుసా..? | Sakshi
Sakshi News home page

జిలేబీ జర్నీ..! భారత్‌కు ఎలా వచ్చిందో తెలుసా..?

Published Fri, May 14 2021 10:14 AM

The Journey Of Jalebi: The Sweet History - Sakshi

అలసి సొలసి ఇంటికి బయలుదేరుడుండగా... ఓ వీధి దుకాణంలో అప్పుడే తయారుచేసిన వేడి వేడిగా జిలేబీ  మీ కంటికి ఎదురైతే.. ఇక మీ అడుగులు ఇంటికి బదులుగా ముందు జిలేబీ దగ్గరకే చేరుకుంటాయి. అంతేనా.. వెంటనే ఒక జిలేబి తీసుకొని తినేంతవరకూ మీ చేతులు కూడా ఊరుకోవు! మరి ఇంతలా మాయచేయగల ఆ తియ్యని జిలేబీ వెనుక ఒక పెద్ద చరిత్రనే ఉంది. చాలా మంది ఇది స్వదేశీ వంటకంగా పిలుస్తుంటారు. కానీ, జిలేబీ జర్నీ వేరే.... వాస్తవానికి, మధ్య– తూర్పు దేశాలైన జలాబియా, పెర్షియన్‌ నుంచి ’జుల్బియా’గా ఈ వంటకాన్ని  దిగుమతి చేశారు. 10వ శతాబ్దాంలో ముహమ్మద్‌ బిన్‌ హసన్‌ అల్‌–బాగ్దాది రాసిన ’ కితాబ్‌ అల్‌ తబీఖ్‌’ పురాతన పెర్షియన్‌ వంటల పుస్తకంలో మొదటిగా దీని రెసిపీనీ ప్రస్తావించారు. దీని బట్టే ఇది పెర్షియన్‌ వంటకంగా పరిగణించొచ్చు. 



ఇండియాకు ఇలా వచ్చింది..
సాధారణంగా రంజాన్, ఇతర సంప్రదాయ పండుగ రోజుల్లో ప్రజలు సంతోషాన్ని పంచుకునే నేపథ్యంలో వారు తయారు చేసిన తీపి పదార్థాలను ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అలా ఇబ్న్‌ సయ్యర్‌ అల్‌వార్రాక్‌ అనే అరబ్‌ షెఫ్‌ రాసుకున్న పుస్తకంలో ఈ వంటకం తనకు బహుమతిగా లభించినట్లు రాసుకున్నాడు. ఆ రుచిని మెచ్చిన ఆ వ్యక్తి తాను కూడా ఆ వంటకం నేర్చుకొని వివిధ దేశాల్లో విస్తరింపజేశారు. ఏది ఏమయినప్పటికీ, జుల్బియా భారతీయ జిలేబీకి భిన్నంగా ఉంటుంది. అక్కడ చక్కెర పాకానికి బదులుగా.. మిడిల్‌–ఈస్టర్న్‌ రెసిపీ, తేనె, రోజ్‌ వాటర్‌ సిరప్‌ను ఉపయోగించేవారు. ఈ రెసిపీనే పెర్షియన్‌ వ్యాపారులు భారత ఉపఖండానికి తీసుకువచ్చారు. ‘ప్రియామ్‌కార్న్‌పాకథా’ (క్రీ.శ 1450) – జైనసుర స్వరపరిచిన జైనవచనంలో జిలేబీ గురించి మన దేశంలో మొట్టమొదటగా ప్రస్తావించారు. అక్కడ అతను ఒక భారతీయ వ్యాపారి అందించే విందు మెనులో భాగంగా జిలేబీని పేర్కొన్నాడు. తర్వాత, క్రీ.శ. 1600 లో, సంస్తృత వచనం గుణ్యగుణబోధినిలోనూ ఉంది. అలా...మనోహరమైన జుల్బియా భారతీయ వంటకాల్లో స్వదేశీ ‘జలవల్లికా’ లేదా ‘కుండలికా’గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 15వ శతాబ్దం చివరి నాటికి, జిలేబీ దేశీయ ఉత్సవాల్లో భాగంగా మారింది, అలాగే వివాహాలు, ఇతర వేడుకలు వంటి వ్యక్తిగత సందర్భాలలో కూడా మారింది. దేవాలయాలలో ప్రసాదంగానూ మారింది.

భిన్న రూపాలు..
జిలేబీకి చెందిన అనేక అవతారాలు ఇప్పుడు దేశంలోని ప్రధాన భూభాగంలో ప్రాచుర్యం పొందాయి – ఇండోర్‌ నైట్‌ మార్కెట్ల నుంచి హెవీవెయిట్‌ జిలేబాగా.., బెంగాల్‌ స్వీట్‌ మేకర్స్‌ వంటశాలల నుంచి చనార్‌ జిలిపిగా.., మధ్యప్రదేశ్‌ మావా జిలేబీ..., హైదరాబాద్‌ డోపెల్‌గేంజర్‌ ఖోవా జలేబీ... లేదా ఆంధ్రప్రదేశ్‌ నుంచి జాంగ్రిగా ఇలా వివిధ పేర్లతో రకరకాలుగా జిలేబీ మన దేశంలో ఒక భాగంగా నిలిచిపోయింది.

Advertisement
Advertisement