మొగదిండి మురుగు కాలువలో గుర్రపుడెక్క
కాళ్ల మండలంలో మురుగు కాలువలు తూడు, గుర్రపుడెక్క, కిక్కసతో నిండిపోయాయి. వేసవిలో ప్రక్షాళన పనులు చేపట్టకపోవడంతో వేలాది ఎకరాల పొలాలకు ముంపు పొంచి ఉంది. భారీ వర్షాల కురిస్తే చేలల్లోని ముంపు నీరు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువల్లో తూడుతో నీటి ప్రవాహం మందగించి పొలాలు ముంపు నుంచే బయటపడటం కష్టమని అంటున్నారు. మండలంలో ప్రధానంగా సీసలి వద్ద మొగదిండి మురుగు కాలువ కింద భాగంలో బాగు చేసినా ప్రారంభంలో ప్రక్షాళన పనులు చేయకపోవడంతో గుర్రపుడెక్క మేట వేసింది. అలాగే ప్రధానమైన రుద్రయ్యకోడు మురుగు కాలువ అభివృద్ధి పనులు ప్రారంభంలో చేసినా దొడ్డనపూడి గ్రామం నుంచి చేపట్టకపోవడంతో కిక్కిస, తూడు పేరుకుపోయి శివారు ప్రాంతంలో కాలువ అడవిని తలపిస్తుంది. –కాళ్ల


