ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. గడచిన 17 రోజులకు గాను నగదు రూపేణా రూ. 1,70,80,167 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 116 గ్రాముల బంగారం, 2.135 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.3,500 లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,04,716 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.


