చౌటుప్పల్/కామవరపుకోట: ఆటోను రోడ్డుపక్కన ఆపి టైరు మారుస్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం, జాలపవారిగూడెం గ్రామానికి చెందిన పళ్ల నవీన్కుమార్, సాధనాల లక్ష్మీనర్సింహస్వామి, రాసపోలి కనకరాజు, నాగపోగుల కృష్ణఫణీంద్రలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బొండాలు సేకరించి ఆటోల్లో లోడు చేసుకుని గురువారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని చెరువు సమీపంలోకి చేరుకోగానే పళ్ల నవీన్కుమార్కు చెందిన ఆటో పంక్చర్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మిగతా ముగ్గురు ఆటో డ్రైవర్లు కూడా తమ వాహనాలను ఆపారు. సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఆటో టైర్ మారుస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో సాధనాల లక్ష్మీనర్సింహస్వామి (39) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లా నవీన్కుమార్(27) అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మిగలిన ఇద్దరు ఆటో డ్రైవర్లు చికిత్స పొందుతున్నారు. పల్లా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతులు పల్లా నవీన్ కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నాడు. సాధనాల స్వామి భార్య గర్భవతి. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆటో టైరు మారుస్తుండగా ఘటన


