
నేటి నుంచి వెబ్ ఆప్షన్లు
హెల్ప్లైన్ సెంటర్లు ఇవే..
విద్యార్థులకు సహకరించేందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారికంగా కొన్ని హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏలూరు జిల్లాలో అధికారిక హెల్ప్లైన్ సెంటర్ ఒక్కటీ కూడా ఇవ్వలేదు. ఏలూరు జిల్లా విద్యార్థులు అధికారిక హెల్ప్లైన్ సెంటర్ సేవలు పొందాలంటే తణుకులోని ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళాలి. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజ్, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ డిగ్రీ కళాశాల, స్టెల్లా కాలేజ్ ఎదురుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లకు వెళ్ళవచ్చు. కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ కాకినాడల్లో ఏర్పాటు చేసిన అధికారిక హెల్ప్లైన్ సెంటర్లకు వెళ్ళవచ్చు.
ఏలూరు (ఆర్ఆర్పేట): నేటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. ర్యాంకులు సాధించడం ఒక ఎత్తయితే అనుకున్న కళాశాలల్లో సీట్లు సాధించడం మరొక ఆప్షన్ల ఎంపికలో తొందరపడితే భవిష్యత్పై ప్రభావం పడుతుందంటున్నారు. అందువల్ల ఆచితూచి ఆప్షన్లు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి 18 వరకూ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మంచి ర్యాంకులు సాధించిన వారు సీఎస్ఈకే మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కొత్తగా ఒక ట్రెండ్ నడుస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆయా ప్రాంతాల్లోని ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులకు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. తమ కళాశాలకు తొలి ప్రాధాన్యతగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా ఇంటర్నెట్ సెంటర్కు వచ్చే విద్యార్థులతో ఒప్పించి ఆప్షన్ పెట్టిస్తే ఒక్కో విద్యార్థికి రూ.5 వేల కమిషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో పాటు వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు కూడా ఆయా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇలాంటి ఆఫర్లనే ఇస్తున్నారని తెలిసింది. ఆయా లెక్చరర్ల ద్వారా తమ కళాశాలలో విద్యార్థులను చేర్చితే లెక్చరర్కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఇస్తున్నారంటున్నారు.
దళారులను నమ్మొద్దు
అయితే ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు, మరికొందరి మాటలు నమ్మితే విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందంటున్నారు. బాగా నమ్మకస్తులైన వారి సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కొంతమంది కేవలం తాము చెప్పిన కళాశాలకే ఆప్షన్ పెట్టి మరే ఆప్షన్ అవసరంలేదని నమ్మిస్తున్నారని తెలుస్తోంది. అలా చేస్తే సాంకేతిక కారణాల వల్ల సీటు రాకపోతే రెండో కౌన్సెలింగ్ వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమకు ఆశించిన కళాశాలలో సీటు కోల్పోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు.
వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలో పాస్వర్డ్ను ఎవరికీ చెప్పవద్దని సూచిస్తున్నారు. ఇటీవల వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు నేరుగా తమకు సమీపంలోని కళాశాలలకే వెళుతున్నారని, అక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చే క్రమంలో పాస్వర్డ్ వారికి చెప్పాల్సి వస్తోందని, ఆ సందర్భం వస్తే విద్యార్థులే వారి పాస్వర్డ్ను ఎంటర్ చేస్తామని సంబంధిత వ్యక్తులకు ఖరాఖండిగా చెప్పాలని సూచిస్తున్నారు. వారికి వచ్చే ఓటీపీని కూడా ఇతరులతో పంచుకోవద్దని చెబుతున్నారు. ఇలా చేస్తే విద్యార్థుల ఎదుట వారు చెప్పిన క్రమంలోనే ఆప్షన్లు ఇచ్చినా వారు వెళ్ళిన తరువాత వారే ఆప్షన్లు మార్చే అవకాశముందంటున్నారు.
ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు ఇలా..
ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ఏలూరు జిల్లాలో మొత్తం 6 ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల, హేలాపురి ఇంజనీరింగ్ కళాశాల ఏలూరు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. ఆగిరిపల్లిలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడులో సారధి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ఈ ఏడాది విద్యార్థులకు ఆయా బ్రాంచుల్లో మొత్తం 4920 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలలుండగా దాదాపు 14,600 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి.
ఏలూరు జిల్లాలో 6, పశ్చిమ గోదావరిలో 14 ఇంజినీరింగ్ కాలేజీలు
ఆచితూచి ఆప్షన్లు పెట్టుకోవాలంటున్న నిపుణులు