
‘ఉపాధి’ బకాయిలు విడుదల చేయాలి
ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీల వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ ఆరోపించారు. స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో గురువారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. పనులు చేసి రెండు నుంచి మూడు నెలలు కావస్తున్నా నేటికీ కూలీలకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. దీంతో కూలీల జీవనం కష్టంగా మారిందన్నారు. కూలీల వేతనాలను కాంట్రాక్టర్లకు అప్పగించే పని కూటమి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మంత్రి పవన్ కల్యాణ్ పేదల పక్షాన లేదా కాంట్రాక్టర్లు పక్షాన అనేది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కూలీలకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా, మండల స్థాయి అధికారులు జాబ్ కార్డులు కోసం కూలీల నుండి డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు.
వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి
ఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా ఆకివీడుకు చెందిన పడాల శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగింది. ఆకివీడు నగర పంచాయతీ విప్గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
గోదావరి వరదపై అప్రమత్తం
ఏలూరు(మెట్రో): గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బలహీనంగా ఉన్న కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు అధిక వర్షాలు, వరదల దృష్ట్యా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పునరావాస కార్యక్రమాల నిర్వహణకు మండల ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వేలేరుపాడు మండలానికి డీఆర్డిఏ పీడీ ఆర్.విజయరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర, కుక్కునూరు మండలానికి జెడ్పీ సీఈఓ శ్రీహరి, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి అన్సారీలను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు.
విద్యతోనే కలల సాకారం
ఏలూరు (ఆర్ఆర్పేట): కలలను సాకారం చేసు కునేందుకు విద్య ఒక్కటే ఉత్తమ మార్గమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూరుశాతం నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో గతేడాది టెన్త్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయుల సమకూర్చిన నగదు బహుమతులను అందజేశారు. ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, ఆర్ఐఓ కె.యోహన్ తదితరులు పాల్గొన్నారు.
తిరువన్నామలై రైలుకు
వీరవాసరంలో హాల్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): నర్సాపూర్–తిరువన్నామలై ప్రత్యేక రైలుకు వీరవాసరం స్టేషన్లో రెండు నిమిషాలు హాల్టింగ్ సదుపాయం కల్పించినట్టు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నుంచి వెళ్లే రైలు (07219) వీరవాసరం స్టేషన్కు మధ్యాహ్నం 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. తిరువన్నామలై నుంచి వచ్చే రైలు (07220) రాత్రి 11.28 గంటలకు వీరవాసరం స్టేషన్కు చేరుకుని, తిరిగి 11.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.

‘ఉపాధి’ బకాయిలు విడుదల చేయాలి

‘ఉపాధి’ బకాయిలు విడుదల చేయాలి