
కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యను వ్యాపారంగా మారుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్ మాట్లాడుతూ పట్టణంలో పలు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర సామాగ్రి పాఠశాలలోనే కొనాలని ఒత్తిడి చేస్తూ అసలు ధర కన్నా రెండు నుంచి మూడు రెట్లు అధికంగా విక్రయిస్తూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఫిర్యాదు మేరకు ఎంఈఓ జ్యోతి ప్రైవేట్ పాఠశాల పుస్తకాలు గదిని సీజ్ చేశారు. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళన విరమించారు. ఆందోళనలో పట్టణ నాయకులు నాగేంద్రబాబు, టి.రవిబాబు, మణికంఠ, గణేష్, సింధు, తదితరులు పాల్గొన్నారు.