
పూడికతీత.. ఏదీ పనుల్లో నాణ్యత?
సాక్షి టాస్క్ఫోర్స్: శివారు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన గోదావరి కాల్వ పూడిక తీత పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. దీంతో తమకు సాగునీటి కష్టాలు తప్పవేమోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గోదావరి కాల్వలో పూడిక తీత పనులు చేస్తున్నారా లేక గుర్రపు డెక్క, కర్ర నాచు తొలగింపు పనులు చేపడుతున్నారో అర్థం కాని పరిస్థితి. గుండుగొలను డీసీ పరిధిలో పూళ్ల నుంచి గుండుగొలను వరకు పూడికతీత పనులు జరుగుతున్నాయి. కర్ర నాచు వల్లే గోదావరి కాల్వ నీరు శివారు ప్రాంతాలకు చేరడం లేదని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు ఆ కర్ర నాచు ఎదగకుండా పనులు చేస్తున్నారు. వాస్తవానికి కర్రనాచును నాశనం చేసేందుకు రసాయనాలను స్ప్రే వాడాలి. అయితే సంబంధిత అధికారులు మాత్రం అలా కాకుండా కాల్వలోని కర్రనాచును జేబీసీలతో తీసి కాల్వ గట్టుపై వేస్తున్నారు. వర్షం వస్తే గట్టుపై వేసిన మట్టి మళ్లీ కాల్వలో జారిపడుతుందని, మరలా కర్రనాచు పెరిగి ప్రయోజనం శూన్యమని అంటున్నారు. దీనితో లక్షలాది రూపాయలు ప్రజాధనం నీటిలో పోసినట్లేనని పెదవి విరిస్తున్నారు. కాల్వలో కొన్ని చోట్ల పనులు జరుగుతుండగానే కాల్వకు నీటిని విడుదల చేయడంతో పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గుండుగొలను ఇరిగేషన్ సెక్షన్ పరిధిలోని 35 వేల ఎకరాల్లోని వరి పంట సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. దాళ్వాలో గోదావరి కాల్వ శివారు రైతాంగానికి సాగునీరు అందక ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో గోదావరి కాల్వకు పూడిక తీత పనులు జరిగాయి. సాగునీటికి గత ఐదేళ్ల కాలంలో ఎన్నడూ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడిన పరిస్థితులు రాలేదు. దీనితో పాటు దాళ్వాలో రైతులకు సీలేరు జలాలను తీసుకుని వచ్చి రైతులకు సాగునీటికి అందించింది. కానీ కూటమి ప్రభుత్వం దాళ్వాలో రైతులు నీటి కోసం రాత్రిళ్లు జాగారాలు చేశారు.
హడావుడి పనులు.. నాణ్యతపై అనుమానాలు
దాళ్వాలో రైతులు పడ్డ కష్టాలను చూసిన ఇరిగేషన్ ఉన్నతాఽఽధికారులు ఈ పనులను కాల్వ మూసివేసిన ఏప్రిల్ నెలాఖరు నుంచే చేపట్టాల్సి ఉంది. అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేయకపోవడంతో మే నెలాఖరున ఈ పనులు చేపట్టారు. దీనితో పనులు అలస్యమయ్యాయి. హడావుడిగా ఈ పనులు చేపట్టడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి దశలో పనులు జరుగుతుండగానే గోదావరి కాల్వ వెంబడి గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తడంతో కాల్వలోకి నీటిని విడుదల చేశారు. దీనితో కొన్ని చోట్ల పనులు నిలిచిపోయాయి. ఏడాదంతా డీసీ పరిధిలోని సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గుర్రపుడెక్క, కర్రనాచులను తొలగించేందుకు వెచ్చించాల్సిన లక్షలాది రూపాయలను ఈ పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని వాపోతున్నారు. దాళ్వాలో సాగునీటి కష్టాలు తప్పవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హడావుడిగా గోదావరి కాలువ పూడిక తీత పనులు
నిబంధనలను పాటించని వైనం
ప్రశ్నార్థకంగా 35 వేల ఎకరాల సాగు
సాగునీటి కష్టాలు తప్పవంటున్న రైతన్నలు

పూడికతీత.. ఏదీ పనుల్లో నాణ్యత?