
ఆక్వా ఉక్కిరిబిక్కిరి
భీమవరం అర్బన్: గత నెల రోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు కనిపిస్తుండడంతో ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు పడడంతో చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ శాతాల్లో మార్పులు తలెత్తుతున్నాయి. దీంతో చేపలు, రొయ్యలు వైరస్ల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. భీమవరం మండలంలో నాగిడిపాలెం, దొంగపిండి, కొత్తపూసలమర్రు, అనాకోడేరు, కొమరాడ, వెంప, పెదగరువు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్తపూసలమర్రు, లోసరి తదితర గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల్లో చేపలు, సుమారు 7 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల పెంపకం సాగిస్తున్నారు. గత నెల రోజులకుపైగా వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు పడటంతో శీలావతి, కట్ల, రూప్ చంద్, గడ్డి చేప, ఫంగస్ తదితర సప్పనీటి చేపలకు రాత్రుళ్లు ఆక్సిజన్ శాతాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి తాటాకు తెగులు, శంకు జలగ, రెడ్ డీసీజ్, పేను కొరుకుడు వంటి వ్యాధులు సోకుతున్నాయని, దీంతో ఉదయం పూట చెరువు ఉపరితలంపై చేపలు అసహనంగా ఈదుతూ మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నివారించేందుకు రాత్రులంతా ఇంజిన్ బోట్లతో తిప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం పంటకాలువలు కట్టేయడంతో చెరువుల్లో నీళ్లు తోడేందుకు సైతం ఆస్కారం లేదని చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నామని చేప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ దాడికి రొయ్యలు మృత్యువాత
వాతావరణంలో ఉష్ణోగ్రతలు స్థిరంగా లేకపోవడంతో చెరువుల్లోని నీటి పరమాణువులైన పీహెచ్, ఆమ్మోనియా, నైట్రోజన్, ఆక్సిజన్ శాతంలలో హెచ్చుతగ్గులు ఏర్పడి వైట్ స్పాట్, విబ్రియో, వైట్గట్, తదితర వైరస్లు వ్యాప్తిచెంది రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ వైరస్ల వల్ల 30 రోజులలోపే రొయ్యలు చనిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతలేని సీడ్తో ఇబ్బందులు
నాణ్యత ఉన్న వనామీ సీడ్కు వైరస్ల ప్రభావం తక్కువగా ఉటుంది. కొన్ని రొయ్య పిల్ల ఉత్తత్తి కేంద్రాలు వనామీ పిల్లలు ఉత్పత్తి చేయడంతో రొయ్యపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువై కొద్దిపాటి వాతావరణ మార్పులకే వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. అలాగే నాణ్యత, నాణ్యతలేని సీడ్ తెలుసుకోవడానికి పీసీఆర్ పరీక్ష ద్వారా ఈహెచ్పీ, విబ్రియో, వైట్ స్పాట్ పరీక్షలు చేస్తేనేగానే తెలియదు. నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేస్తే రొయ్యలు పట్టుబడికి వస్తాయి. దీంతో రైతుకు పెట్టుబడుపోను కొంతైనా మిగిలితే మళ్లీ వనామీ రొయ్యల పెంపకం సాగిస్తాడు.
వాతావరణ మార్పులతో ఆక్వా రంగం కుదేలు
వైరస్ల బారిన చేపలు, రొయ్యలు
ఆందోళనలో ఆక్వా రైతులు
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ఎకరం చెరువులో నాణ్యతలేని సీడ్ వేస్తే రొయ్యలకు వైరస్ వచ్చి నెల రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు పైగా రైతు నష్టపోతున్నాడు. ఫీడ్ ధరలు పెరిగిపోయాయి. రొయ్య ధరలు తగ్గిపోతున్నాయి. మా తీర ప్రాంత గ్రామాల రైతులంతా రొయ్యల పెంపకంపైనే ఆధారపడుతున్నాం. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి – వాటాల విజయ్ కుమార్,
రొయ్య రైతు, నాగేంద్రపురం

ఆక్వా ఉక్కిరిబిక్కిరి