
గళమెత్తిన కార్మిక సంఘాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, స్టీల్ ప్లాంట్ను పరి రక్షించాలని కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు ఆపాలని, విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద పెట్టున నినదించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్సులు డీఎన్ వీడి ప్రసాద్, కే.బుచ్చిబాబు, ఎర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.
జర్నలిస్టులకు న్యాయం చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలను పునరుద్ధరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ శంకరరావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు ఎస్డీ జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. పనిచేసే విలేకరులు అందరికీ ప్రభుత్వ గుర్తింపు అక్రెడిటేషన్ ఇవ్వాలని, మూడు సెంట్ల చొప్పున స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్, సీనియర్ జర్నలిస్టు కె.బాలశౌరి, ఎం.గంగరాజు, జయరాం, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మద్దిలో యోగాంధ్ర
ఏలూరు(మెట్రో): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. అలాగే ఈనెల 18న కామవరపుకోట మండలం జీలకర్రగూడెం–గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద యోగాసనాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు.
ఏలూరులో ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, జేసీ పి. ధాత్రిరెడ్డి, మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో వృద్ధిరేటు సాధన దిశగా జిల్లా, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి, విజన్ ప్లాన్ల అమలుకు అధికారులు ప్రత్యే క దృష్టి సారించాలని రాష్ట్ర పౌర సరఫరాల శా ఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను కోరారు. అమరావతి నుంచి సో మవారం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల విజన్ ప్లాన్లను ముఖ్యమంత్రి వర్చువల్గా విడుదల చేశారు. కలెక్టరేట్లో ఈ కార్యక్రమాన్ని వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన అనంతరం మంత్రి మనోహర్ జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి విజన్ ప్లాన్పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కలెక్టరేట్లోని ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సీపీఓ వాసుదేవరావు పాల్గొన్నారు.
డీఎస్సీ పరీక్షలకు 720 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో సోమవారం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు 720 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 180 మందికి 179 మంది, మధ్యాహ్నం 180 మందికి 159 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 200 మందికి 196 మంది, మధ్యాహ్నం 200 మందికి 186 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.