
11న చలో మంగళగిరి
ఏలూరు (ఆర్ఆర్పేట): కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 11న చేపట్టిన చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ కోరారు. సోమవారం స్థానిక అన్నే భవనంలో కౌలు రైతుల చలో మంగళగిరి కరపత్రాలను ఆవిష్కరించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కౌలు రై తులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించాలని, వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని కోరారు. ఈనెల 11న మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని కౌలు రైతులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.