
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఉపాధ్యాయుల నిరసనలతో ప్రభుత్వం దిగిరాక తప్పదని ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా కార్యాలయం వద్ద సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బదిలీల అంశంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నామన్నారు. దీక్షల్లో పాల్గొన్నవారికి ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ మజ్జిగ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఎస్టీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్ రుద్రాక్షి, యూటీయూ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు విజయ రామరాజు, ఏపీటీఎఫ్ 1938 ఏలూరు జిల్లా అధ్యక్షుడు జి.మోహన్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు బి.రమణ, ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పీబీవీఎన్ఎల్ నారాయణ, వైఎస్ఆర్టీఏ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.