
డాంగేనగర్లో అగ్నిప్రమాదం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఉన్న డాంగే నగర్లో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ హైవోల్టేజ్ రావడంతో పలువురి ఇళ్లలో విద్యుత్ పరికరాలు, సామగ్రి దగ్ధమయ్యాయి. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. పొడుదోలు నాగేంద్రబాబు ఇంట్లో ఫ్రిడ్జ్, కూలర్, ఇన్వర్టర్లు, ఫ్యాన్లు, వైరింగ్, లైట్లు హైవోల్టేజ్ కారణంగా కాలిపోయాయి. ఇంట్లో సామగ్రి కూడా దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. శీలం మంగరాజు ఇంట్లో టీవీ, ఫ్యాన్లు, కలపాల శ్రీనివాస్ ఇంట్లో ఫ్యాన్లు, బల్బులు దగ్ధమయ్యాయి. విద్యుత్ శాఖ అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సోమవారం విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.