
విద్యా రంగంలో ఆదర్శంగా నిలపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రణాళిక బద్ధంగా విద్యారంగంలో వినూత్న మార్పులతో ఏలూరు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని, అందుకు అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగు కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన షైనింగ్ స్టార్ కార్యక్రమాన్ని మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని 163 ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ 32,60,000, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ 6.80 లక్షలు చెక్కులు అందించి, సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గమన్నారు. జిల్లాలో 2.78 లక్షలు విద్యార్థులు ఉండగా 1.30 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లాలో 10 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారని వీరంతా ప్రణాళికాబద్ధంగా మరింత మెరుగైన విద్యను అందించడం ద్వారా జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యం ప్రవేశపెడుతున్నామన్నారు. కలెక్టరు వెట్రిసెల్వి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరున మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ పేరున విద్యార్థులకు పుస్తకాలు తదితర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింటు కలెక్టరు ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేషన్ షాపు తనిఖీ
ఏలూరులోని షాపు నెంబర్ 74 చౌక ధరల దుకాణాన్ని, స్ధానిక ఈదర సుబ్బమ్మ నగరపాలక ఉన్నత పాఠశాలను జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీలర్ ఇచ్చే బియ్యం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఇంకా డోర్ డెలివరీ పూర్తిచేయకపోవడంపై మంత్రి డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.