
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఏలూరు టౌన్: ఏలూరు మండలం తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీలో గత నెలలో జరిగిన చోరీ కేసును వన్టౌన్ సర్కిల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయతో ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వివరాలు వెల్లడించారు. తంగెళ్ళమూడి భాగ్యనగర్ కాలనీకి చెందిన పడవల వెంకట శ్రీనివాస్ ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు. మే నెల 26న కుమారుల చదువుల నిమిత్తం రాజమహేంద్రవరంలో అద్దె ఇల్లు చూసుకునేందుకు కుటుంబంతో కలిసి ఇంటికి తాళాలు వేసి వెళ్ళారు. పనులు ముగించుకుని సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్లగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడగా బెడ్రూమ్లో బీరువా తాళాలు పగులగొట్టి దానిలోని బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. శ్రీనివాస్ ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వన్టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ సీహెచ్కే దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ పుటేజ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు సత్తినపల్లి రాకేష్ను సోమవారం మధ్యాహ్నం ఏలూరు హనుమాన్నగర్లో అదుపులోకి తీసుకున్నారు. పెదపాడు ఇందిరా కాలనీకి చెందిన రాకేష్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.