
నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయం
కాళ్ల: స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం పెద్ద అమిరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నివేదిత విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యాలయాన్ని కలెక్టర్, గుంటూరు శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ ప్రారంభించారు. తరగతి గదులలో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు విద్యతో పాటు విలువలతో కూడిన మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పి ఉత్తములుగా తీర్చిదిద్దటమే లక్ష్యంతో బాలికలకు ఉచిత విద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు పేద బాలికలకు మాత్రమే విద్యను అందిస్తామన్నారు. సుమారు 770 మంది బాలికలకు ప్రవేశం కల్పించనునట్లు తెలిపారు. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు.