
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
కుక్కునూరు: బైక్ అదుపు తప్పడంతో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుక్కునూరు గ్రామానికి చెందిన నాగ శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్న సమయంలో పొలం వెళుతుండగా, మోటార్సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయాడు. నాగశ్రీనివాస్ తలకు తీవ్ర గాయమైంది. భద్రాచలం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేశారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ నాగశ్రీనివాస్ మృతిచెందాడు. వైఎస్సార్సీపీ నాయకులు నాగశ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బోను లక్ష్మీపతి(49) ఈ నెల 8న పనిమీద బైపాస్ రోడ్డు వద్దకు పనిమీద వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో స్థానిక తపస్ స్కూల్ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద మోటార్సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. చికిత్స పొందుతూ 9వ తేదీ ఉదయం లక్ష్మీపతి మృతిచెందినట్లు హెచ్సీ తెలిపారు.