
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ జగన్ వెంటే..
మీడియాలో దుష్ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం
దెందులూరు: తాను ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే, వైఎస్సార్సీపీ కే పనిచేస్తానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. కొన్ని మీడియా సంస్థలు తాను పార్టీ మారుతున్నట్టు చేసిన దుష్ప్రచారాన్ని శుక్రవారం ప్రకటనలో ఖండించారు. ప్రాణం ఉన్నంత వరకూ తనకు, తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన వైస్ జగన్ తోనే తన పయనం అన్నారు. తనకు వైఎస్సార్ కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయరానిదన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారాన్ని చేయటం బాధ కలిగించిందన్నారు. ఇది సిగ్గుచేటని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడులకు విద్యార్థి మిత్ర కిట్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు అందించాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర–1 కిట్లు జిల్లాలోని అన్ని పాఠశాలలకు చేరుకోవాలని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ బి.శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన ఏలూరులోని ఈదర సుబ్బమ్మ దేవి మున్సిపాల్ కార్పొరేషన్ హైస్కూల్, పెదవేగి హైస్కూల్, వట్లూరు హైస్కూళ్లలో మండల స్థాయి స్టాక్ పాయింట్లను పరిశీలించారు. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బెల్టులు, నోట్ పుస్తకాల నాణ్యతను పరిశీలించారు. జిల్లా స్టూడెంట్ కిట్స్ ఇన్చార్జి కె.ప్రతిష్ట, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ కె.పంకజ్కుమార్, సమగ్ర శిక్ష ఇన్చార్జి సీఎంఓ జె.రవీంద్ర ఉన్నారు.
పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): వైద్యారోగ్య శాఖలో సచివాలయం హెల్త్ సెక్రటరీలకు ఎంపీహెచ్ఏ (ఎఫ్) పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వారు మాట్లాడుతూ తొమ్మిది నెలల క్రితమే పదోన్నతులకు ఆదేశాలు వచ్చినా జిల్లా అధికారులు తా త్సారం చేశారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అమలుచేయకుండా ఈనెల 15కు కౌన్సెలింగ్ వాయిదా వేయడం తగదన్నారు.
మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం గడువును ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 30 వరకూ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సమాంతరంగా కొనసాగుతుందని తెలిపారు.
9న కొల్లేరుపై కీలక సమావేశం
కై కలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు పరిశీలనకు త్వరలో రానున్న సెంట్రల్ ఎంపవర్ట్ కమిటీ (సీఈసీ)కి నివేదించే అంశాలపై ఈనెల 9న ఉదయం 9 గంటలకు కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న సమావేశానికి కొల్లేరు పెద్దలు తరలిరావాలని రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు శుక్రవారం కోరారు. కొల్లేరు ప్రజల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. కమి టీ దృష్టికి కొల్లేరు గ్రామాలకు సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలను రాతపూర్వకంగా గ్రామాల ప్రజలు తీసుకురావాలని చెప్పారు. గ్రామాల జనాభా, విస్తీర్ణం, కొల్లేరుకు సంబంధించిన అంశాలు అందులో ఉండాలన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరవుతారన్నారు.
విద్యా వ్యాపారాన్ని పట్టించుకోని అధికారులు
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పలు ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాలను విద్యార్థులకు విక్రయిస్తూ డబ్బులు గుంజుతున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొలిక్కపోగు లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిడమర్రు మండలం బావాయిపాలెంలోని చైతన్య విద్యాసంస్థలో పుస్తకాల అమ్మకాన్ని అడ్డుకున్నట్టు తెలిపారు.