
జనాభా నిర్వహణపై ప్రజాభిప్రాయం
ఏలూరు(మెట్రో): జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఈనెల 20 వరకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రణాళిక శాఖ ప్రచురించిన జనాభా నిర్వహణ విధానం ప్రతి కుటుంబం ముఖ్యం–మీ అభిప్రాయం మార్గదర్శనం వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జనాభా సమతుల్యత సాధించే దిశలో జూన్ 20లోపు జనాభా నిర్వహణ విధానంపై ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జనాభా సమతుల్యత లక్ష్యంగా జనాభా నిర్వహణ విధానం (పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ)పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 9 ప్రశ్నలకు సంబంధించి ప్రజలు అభిప్రాయాలు తెలపాల్సి ఉందన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సీహెచ్ వాసుదేవరావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
9న యోగాంధ్రపై ర్యాలీ : ఈనెల 9న యోగాంధ్ర కార్యక్రమంపై జిల్లావ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
నిరాధార ఆరోపణలను ఊరుకోం
ప్రభుత్వ అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా ధ్రువీకరించని, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేసే వ్యక్తులుగాని, మీడియా ప్రతినిధులు, ఇతర సమూహాలు ఎవరైనా గాని చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.