
మండుతున్న సూరీడు
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడ దెబ్బకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు అదేశాలు జారీ చేశాం. వారు గ్రామాల్లోని ఎంఎల్ హెచ్పీ, ఆశ, ఏఎన్ఎంల ద్వారా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగిలిన వారికి మెరుగైన వైద్యం అందిచేందుకు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాం.
– జి.గీతాభాయి, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారిణి భీమవరం
●
భీమవరం (ప్రకాశం చౌక్): రొహిణి కార్తె ప్రారంభంలో ముందుగానే వచ్చిన రుతుపవనాల కారణంగా వర్షాలు పడడంతో వాతావరణం చల్లబడి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం నుంచి తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రోజూ దాదాపుగా అన్నిచోట్లా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లాంటేనే భయాందోళన చెందే పరిస్థితి నెలకొని ఉంది. ఉద్యోగాలకు, ఇతర పనులకు వెళ్లే వారు ఉదయం 8 గంటలకే ఆయా పనులకు వెళ్లిపోతున్నారు. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ ఉండడంతో జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం సాగించే ప్రయాణికులు, వాహనదారులు వేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు దారి మధ్యలో చెట్ల నీడల్లో సేదతీరుతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు శీతలపానీయాలను ఆశ్రయిస్తూ సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు పగటి పూట చేయాల్సిన పనులు కొందరు రాత్రులు చేసుకునే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల టెంట్లు వేసుకుని అత్యవసరమైన పనులు చేసుకుంటున్నారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తాలు తీసుకోవాలి
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారి నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి జి.గీతాభాయి వివరించారు.
● సాధ్యమైనంత వరకు ఎండలో తిరగరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తలకు టోపి, లేదా టవల్ కట్టుకోవడం, గొడుగు వేసుకుని వెళ్లడం మంచిది. మంచినీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి.
● నలుపు, ముదురు రంగు దుస్తులు కాకుండా తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి.
● రోడ్ల మీద విక్రయించే పానీయాలు (రంగునీళ్లు), కూల్డ్రింక్స్ తాగరాదు.
● మాంసాహారం, మసాలాతో తయారుచేసిన ఆహరం తినరాదు. ఆకు కూరలు, కూరగాయలతో తయారు చేసిన ఆహారం మేలు.
● పరిశుభ్రమైన నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఇంటిలో తయారుచేసే పండ్ల జ్యూసులు తీసుకోవాలి.
● మద్యం సేవించడం, పొగ తాగడం వంటివి చేయరాదు. మద్యం సేవించి ఎండలో ప్రయాణించడం మంచిదికాదు.
● వృద్ధులు, గర్భిణీలు, చినపిల్లలు ఇంటిలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లనీయరాదు.
● వేసవి సెలవులు కాబట్టి పిల్లలు బయటకు వెళ్లే ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారికి ఇంటిలోనే ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.
భీమవరంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు
ఉదయం నుంచే భానుడి భగభగలు
వడగాలులు, ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం
వృద్ధులు, చినపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స ఇలా
ఎవరైనా వడ దెబ్బకు గురైతే కళ్లు తిరిగి పడిపోవడం, శరీరం చెమటలు పట్టడం, స్పృహలో లేకపోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని ముందుగా నీడకు చేర్చి చల్లనీ నీళ్లతో శరీరాన్ని తుడవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చేవరకు తడి గుడ్డతో తుడుస్తూ చల్లగాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ గానీ ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ తాగించాలి. నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించాలి.

మండుతున్న సూరీడు

మండుతున్న సూరీడు