
ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఇళ్ల ప్రగతికి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించే దిశగా గృహనిర్మాణ శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. లక్ష్యాలను సాధించకపోతే ఉపేక్షించేది లేదని.. రానున్న 10 రోజుల్లో ఇళ్ల నిర్మాణాల ప్రగతి కనబడాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఈఓపీఆర్డీఓ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని 27 మండలాల్లో ఆయా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. సమీప నర్సరీల నుంచి మొక్కలు తీసుకుని జూన్ 5న నాటేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రస్తుతం రెడ్ క్రాస్ వద్ద ఉన్న రెండు డయాలసిస్ మిషన్లకు అదనంగా మరో రెండు డయాలసిస్ మిషన్లతో డయాలసిస్ సెంటర్ను త్వరగా ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రెడ్ క్రాస్ కార్యవర్గానికి సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్, కమిటీ సభ్యులు మంగళవారం కలెక్టర్ను కలిసి రెడ్ క్రాస్ కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ఉద్యానవన సంబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కలిగించేందుకు ఏజెన్సీ ప్రాంతంలో వర్క్షాప్ నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పీఎం విశ్వకర్మ పథకం ప్రగతి తీరుపై సమీక్షించారు. జిల్లాలో సింగిల్ విండో కింద దరఖాస్తు చేసుకున్న 51 మందికి పరిశ్రమల ఏర్పాటుకు సమావేశం అనుమతులు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది.