
ప్రభుత్వం ప్రతి గింజా కొనాల్సిందే
ఉంగుటూరు: రైతులకు ఎల్లవేళలా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, తడిసిన ధాన్యాన్ని ప్రభు త్వం కొనుగోలు చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), రాష్ట్ర రాజకీ య సలహా కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. సోమవారం మండలంలోని గోపీనాథపట్నం, చేబ్రోలు ఆయకట్టులో ధాన్యం రాశులు, నెట్లు కట్టిన ధాన్యాన్ని వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎన్నార్, వాసుబాబు మాట్లాడుతూ రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ముందుగా 1.50 లక్షల టన్నులు తర్వాత 2 లక్షల టన్నులు, ఇప్పుడు 2.50 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే అని అన్నారు. రైతులు ధాన్యం పట్టుబడులు పట్టి పొలాల్లో నిల్వ ఉంచితే వాటి ఊసు లేకుండా.. ధాన్యం కొని ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అనడాన్ని ఖండించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు గుర్తు చేశారు. అప్పట్లో రూ.3 వేల కోట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు టార్గెట్ పూర్తయిందనడం సరికాదన్నారు. దళారులు మద్దతు ధర కంటే బస్తాకు రూ.400 తగ్గించి కొంటున్నారని, ఇలా రైతులు నష్టపోవాలా అని మండిపడ్డారు. చేబ్రోలులోని వైఎస్సార్ కాలనీకి వెళ్లే దారిలో, గోపీనాథపట్నం కాలనీ వద్ద ధాన్యం గుట్టలను వారు పరిశీలించారు. వైఎస్సార్సీపీ చింతలపూడి సమన్యయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), పార్టీ మండల అధ్యక్షులు మరడ మంగరావు, రాయిపాటి సత్య శ్రీనివాసు, దండు రాము, రాష్ట్ర బూత్ వింగు కమిటీ కార్యదర్శి యెలిశెట్టి పాపారావు బాబ్జి, నిడమర్రు జెడ్పీటీసీ కోడే కాశీ, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, నా యకులు పుప్పాల గోపి, కొరిపల్లి శ్రీను, తమ్మ గంట బవాని, వెజ్జు వెంకటేశ్వరరావు, కరణం బుజ్జి తదితరులు వారి వెంట ఉన్నారు.
రైతులకు వైఎస్సార్సీపీ అండ
పార్టీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్