
కూటమిపై సీహెచ్ఓల తిరుగుబాటు
ఏలూరు (టూటౌన్): ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని కోరుతూ విలేజ్ హెల్త్ క్లినిక్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లు కొద్ది రోజులుగా సమ్మె బాట పట్టారు. దీంతో గ్రా మీణ ప్రజలకు వైద్య సేవలు దూరమవుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీహెచ్ఓలు డిమాండ్ చేస్తున్నారు. ఎంఎల్హెచ్సీ/సీహెచ్ఓ లకు రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో పాటు వారిపై అదనపు పనిభారం మోపుతుండటంతో గత నెల 15 నుంచి వీరు ఉద్యమ బాట పట్టారు. గత నెల 27 వరకు పలురకాలుగా నిరసనలు తెలిపినా పాలకుల్లో చలనం లేకపోవడంతో 28 నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 460 విలేజ్ హెల్త్ క్లినిక్లు మూతపడ్డాయి.
జగన్ హయాంలో హెల్త్ క్లినిక్లు
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాల్లోని సబ్ సెంటర్ల స్థానంలో విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. వీటిలో సీహెచ్ఓతో పాటు ఒక ఏఎన్ఎం, ఆశ కార్యకర్త కొన్ని చోట్ల మేల్ హెల్త్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించేవారు. 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 67 రకాల వైద్య పరికరాలను అప్పటి ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారు మిడ్ లెవిల్ హెల్త్ ప్రొవైడర్లు/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం చిన్నచూపు : విలేజ్ క్లినిక్లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే విమర్శలు ఉన్నాయి. సీహెచ్ఓలకు జీతభత్యాల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. అలాగే ఆరేళ్ల సర్వీసు పూర్తయిన సీహెచ్ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. జీఓ.64 ప్రకారం ఎన్హెచ్ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. అయితే 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్ఓలకు మాత్రం ఇవ్వలేదు. ఈపీఎఫ్ జమచేయడం లేదు. ఏడాదిగా ఇన్సెంటివ్లు ఇవ్వడం లేదు. అలాగే సీహెచ్ఓలపై అదనపు పని భారాలను మోపుతున్నారు. వీరికి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయడం లేదు. కనీసం చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి.
గ్రామాల్లో స్తంభించిన వైద్యసేవలు
విలేజ్ క్లినిక్లు మూతపడటంతో గ్రామాల్లో వైద్యసేవలు స్తంభించాయి. ప్రజలు చిన్నపాటి వైద్యానికీ దూరంగా ఉన్న పీహెచ్సీలకు వెళ్లాలి వస్తోంది.
సమస్యలపై సమరం
నాలుగు రోజులుగా విధుల బహిష్కరణ
కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు
మూతపడిన విలేజ్ క్లినిక్లు
నిరవధిక సమ్మెలో 460 మంది..
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరం