లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రిమాండ్‌

Apr 2 2025 2:22 AM | Updated on Apr 2 2025 2:22 AM

లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రిమాండ్‌

లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రిమాండ్‌

కుక్కునూరు: లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్‌ విధించినట్లు సీఐ ఎం.రమేష్‌బాబు మంగళవారం తెలిపారు. కుక్కునూరు పీహెచ్‌సీలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్న కొమరం ముత్యాలమ్మపై గొడ్ల అజిత్‌కుమార్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు అజిత్‌కుమార్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు సీఐ చెప్పారు.

కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలి

కై కలూరు: విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న భవ్య న్యూస్‌ ఎడిటర్‌ కురేళ్ళ కిషోర్‌పై దాడి చేసిన కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పలు దళిత సంఘాలు మంగళవారం డిమాండ్‌ చేశాయి. ప్రముఖ దళిత నాయకుడు మత్తె సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో తాలూకా సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ నుంచి ర్యాలీగా సీఐ కార్యాలయానికి వెళ్లారు. దాడి ఘటనపై తక్షణ కేసు నమోదు చేయాలని రూరల్‌ సీఐ వి.రవికుమార్‌ను కోరారు. అనంతరం విలేకరులతో సూర్యచంద్రరావు మాట్లాడుతూ మార్చి 26న భుజబలపట్నంలో వైస్‌ ఎంపీపీ ఎన్నిక విషయంలో జరిగిన ఘర్షణ ఫొటోలను తీస్తున్న పాత్రికేయుడు కురేళ్ళ కిషోర్‌పై కూటమి నేతలు దాడి చేయడం అమానుషమన్నారు. దాడి చేసిన వారిని ఆయా పార్టీలు సస్పెండ్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత ప్రజా సమితి నియోజకవర్గ అధ్యక్షుడు మత్తె రవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజారత్నం, జిల్లా క్రిస్టియన్‌ మైనార్టీ చైర్మన్‌ మద్దా ప్రేమ్‌కుమార్‌, దళిత నాయకులు పాతపాటి శాంతరాజు, గాలి ప్రసాద్‌, బోడిగంటి కిషోర్‌, బండి ప్రసాద్‌, సోమల శ్యామ్‌సుందర్‌, రత్నరాజు, దాసరి ప్రసాద్‌, రాజు, గోపవరం దళిత యువత హాజరయ్యారు.

వ్యక్తిపై హత్యాయత్నం

ఉంగుటూరు: వ్యక్తిపై హత్యాయత్నం జరిగిన ఘటన మంగళవారం రాత్రి ఉంగుటూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఉంగుటూరు దళిత పేటకుచెందిన యర్రారపు రాజు భార్యతో అదేపేటకు చెందిన మార్లపూడి ప్రసాదు వివాహేతర సంబంధం కలిగి ఉండటంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండుసార్లు పెద్దల సమక్షంలో పెట్టగా గొడవను సద్దుమణిగేలా చేశారు. కాగా మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బైక్‌పై నారాయణపురం వైపు వెళుతున్న ప్రసాద్‌పై రాజు గొడ్డలితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయమైన ప్రసాద్‌ను తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

5న వీఆర్‌ఏల రాష్ట్ర సదస్సు

భీమవరం: విజయవాడ ఎంబీ భవన్‌లో ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర సదస్సుకు అన్ని మండలాల నుంచి వీఆర్‌ఏలు హాజరై జయప్రదం చేయాలని వీఆర్‌ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వీఆర్‌ఏలు విడిపోయారనే పేరుతో ప్రభుత్వం దోబూచులాడుతుందని, అందరూ కలిసి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బడ్జెట్‌ లేదనే పేరుతో జీతాల బిల్లు పెట్టకపోవడం దారుణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement