
చివరికి దక్కని ధర
బకాయిలు వాస్తవమే
ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన తరువాత పంటను అమ్ముకుని ఆ సొమ్మును మరో పంట పెట్టుబడి కోసం వాడేందుకు ఎదురుచూస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ఒక దెందులూరులోనే రూ.10 లక్షలకు పైగా నగదు రైతులకు బ్యాంకు ఖాతాలకు జమ అవ్వలేదు. వస్తాయని నేటికి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వెంటనే బకాయిలు బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి.
– కొలుసు గణపతిరావు, రైతు, దెందులూరు కో–ఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్
●
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నెలన్నర క్రితం రబీ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు ఇంకా రైతు ఖాతాల్లో పడలేదు. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభం కావడం, పనులు ముమ్మరం అవుతున్న తరుణంలో రబీ డబ్బులు లేక పెట్టుబడులకు అప్పులబాట పట్టాల్సిన పరిస్ధితి. కొనుగోలు చేసిన ధాన్యాన్నికి 24 గంటల్లో నగదు జమ చేస్తామని చేసిన ప్రకటన, మంత్రుల సమీక్షలు అంతా ప్రచార ఆర్భాటాలకే పరిమితం తప్ప క్షేత్ర స్ధాయిలో అమలుకాలేదు. జిల్లాలో 2400 మంది రైతులకు రబీ సీజన్కు సంబంధించి రూ.40 కోట్ల మేర నగదు చెల్లించాల్సి ఉంది.
మాటల్లో తప్ప చేతల్లో శూన్యం
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉంటుంది. గత రబీ సీజన్లో 77,466 ఎకరాల్లో వరి సాగు జరగగా 3.53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 1.90 లక్షల ఎకరాల్లో సాగు జరగనుంది. ఈ క్రమంలో గత రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో రైతుసేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని రైతు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తోలుకుని విక్రయించుకోవచ్చని, ఎలాంటి ఆంక్షలు ఉండవని, 24 గంటల వ్యవధిలోనే నగదును ఖాతాలో జమ చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో కొనుగోళ్లు ప్రారంభించి మే నెలాఖరుకు ముగించారు. జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి 3.53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా ప్రభుత్వం 50 శాతం మేర కొనుగోలు చేస్తామని ప్రకటించి 1.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఆ తరువాత రైతులు అడుగుతున్నారని 1.80 లక్షలకు, ఆ తరువాత 2 లక్షలకు, ఆ తరువాత 2.50 లక్షలకు టార్గెట్ను పెంచారు. 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేస్తామని మే మొదటి వారంలో ప్రకటించారు.
రూ.40 కోట్ల బకాయి
మే 9కి ముందు వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు జమ చేశారు. జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీని విలువ రూ.590 కోట్లు కాగా రైతులకు రూ.550 కోట్లు మాత్రమే చెల్లించారు. అది కూడా 2.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి చెల్లించి 2400 మంది రైతులకు రూ.49 కోట్ల వరకు మే 10 నుంచి బకాయిలు ఉండిపోయాయి. దీనిపై అనేకమార్లు విన్నవించినా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా స్పందన శూన్యం. నిధుల కొరతని, సాంకేతిక కారణాలని ఇలా అనేక రకరకాల సాకుతో నెలన్నరగా నగదు చెల్లింపులు నిలిపివేశారు.
ఖరీఫ్ ప్రారంభమైనా ఖాతాల్లో పడని రబీ సొమ్ములు
జిల్లాలో 2,400 మంది రైతులకు రూ.40 కోట్ల మేర బకాయి
మే 9 తరువాత కొన్న ధాన్యానికి జమకాని నగదు

చివరికి దక్కని ధర